ODI series with Australia : అశ్విన్కు పిలుపు
ABN , First Publish Date - 2023-09-20T04:45:10+05:30 IST
ఆసియాకప్ చాంపియన్గా నిలిచిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్సలో తలపడనుంది. ఈనెల 22 నుంచి 27 వరకు మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈనేపథ్యంలో జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు జట్లను

తొలి రెండు మ్యాచ్లకు కెప్టెన్గా రాహుల్
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్కు భారత జట్టు
న్యూఢిల్లీ: ఆసియాకప్ చాంపియన్గా నిలిచిన భారత క్రికెట్ జట్టు ఇప్పుడు ఆస్ట్రేలియాతో వన్డే సిరీ్సలో తలపడనుంది. ఈనెల 22 నుంచి 27 వరకు మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈనేపథ్యంలో జాతీయ సెలెక్షన్ కమిటీ రెండు జట్లను ఎంపిక చేయడం విశేషం. తొలి రెండు వన్డేలకు 15మందిని, మూడో మ్యాచ్కి 17 మందిని ఎంపిక చేశారు. తొలి రెండు మ్యాచ్లకు కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లకు విశ్రాంతినిచ్చారు. దీంతో కేఎల్ రాహుల్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. తిరిగి మూడో వన్డేకు వీరంతా అందుబాటులోకి వస్తారు. అలాగే ఆసియాక్పలో గాయపడిన స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో 37 ఏళ్ల వెటరన్ ఆర్.అశ్విన్ను తీసుకోవడం ఆశ్చర్యపరిచింది. దీంతో అతను వన్డే వరల్డ్కప్ జట్టులోనూ ఉంటాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా తను భారత వన్డే ప్రణాళికల్లో లేడు. గతేడాది జనవరిలో చివరి వన్డే ఆడినా.. నాలుగేళ్లలో ఆడింది రెండు మ్యాచ్లు మాత్రమే. కెప్టెన్ రోహిత్ మాత్రం అశ్విన్ తమ రాడార్లోనే ఉన్నట్టు ఇటీవల చెప్పాడు. అపార అనుభవజ్ఞుడైన అశ్విన్కు వన్డే ఫార్మాట్లో సుదీర్ఘ విరామం వచ్చినా లెక్కలోకి రాదని రోహిత్ మద్దతిచ్చాడు. టెయిలెండర్ బ్యాటర్గానూ జట్టుకు ఉపయోగపడగలని జట్టు భావిస్తోంది. మరోవైపు అక్షర్ పటేల్ను చివరి వన్డేలో చేర్చినా అతను ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. వన్డే వరల్డ్కప్ ముందు భారత్కిదే చివరి సన్నాహక టోర్నీ. అందుకే మూడో వన్డేలో మాత్రం మెగా టోర్నీలో తలపడే జట్టునే బరిలోకి దించారు. ఇందులో అశ్విన్, సుందర్ అదనపు ఆటగాళ్లుగా చెప్పవచ్చు. సెప్టెంబరు 22న మొహాలీ, 24న ఇండోర్, 27న రాజ్కోట్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత రెండు జట్లు వరల్డ్క్పలో ఆడతాయి. ఈ మెగా టోర్నీ ముగిశాక ఆసీస్ భారత్లోనే ఉండి నవంబరు 23 నుంచి ఐదు టీ20ల సిరీ్సలో పాల్గొంటుంది.
తొలి రెండు వన్డేలకు ఎంపికైనవారిలో తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణలకు మూడో మ్యాచ్లో చోటు దక్కలేదు. అయితే రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్, కుల్దీప్ మూడో వన్డే మాత్రమే ఆడతారు.
అయ్యర్ ఎందుకంటే..
వెన్ను నొప్పితో ఆసియాకప్ సూపర్4లో పాక్తో మ్యాచ్కు దూరమైన శ్రేయాస్ ఆ తర్వాత టోర్నీలో ఆడనేలేదు. ఇప్పుడు ఆసీ్సతో సిరీ్సకు ఎంపిక కావడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ‘అయ్యర్ ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు. అందుకే ఎంపిక చేశాం. బ్యాటింగ్, ఫీల్డింగ్లోనూ ఎలాంటి సమస్య లేదు. సిరీ్సలోనూ ఇలాగే ఉంటాడని ఆశిద్దాం’ అని అగార్కర్ కోరాడు.
తిలక్ వర్మకు మరో చాన్స్
మొదటి రెండు వన్డేలకు రాహుల్ (కెప్టెన్), గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్, ఇషాన్, సూర్యకుమార్, జడేజా, శార్దూల్, బుమ్రా, సిరాజ్, షమి, తిలక్, ప్రసిద్ధ్, అశ్విన్, సుందర్.
చివరి వన్డే జట్టు
రోహిత్ (కెప్టెన్), గిల్, హార్దిక్, విరాట్, శ్రేయాస్, రాహుల్, ఇషాన్, సూర్యకుమార్, జడేజా, శార్దూల్, బుమ్రా, సిరాజ్, షమి, కుల్దీప్, అశ్విన్, అక్షర్, వాషింగ్టన్ సుందర్.