అపార్ట్మెంట్లో భరించలేని దుర్వాసన.. ఎలుక చనిపోయిందేమోనని.. అంతా చెక్ చేసి చివరకు ఓ ఫ్లాట్ లోపలికి వెళ్లి చూస్తే..!
ABN , First Publish Date - 2023-06-02T21:26:07+05:30 IST
ఢిల్లీలోని ఓ అపార్ట్మెంట్లో నివసించే తల్లీకూతుళ్ల మరణించి వారంరోజులు గడిచిపోయినా చుట్టుపక్కల వారికి తెలియలేదు. దుర్గంధం వ్యాపిస్తుండటంతో వారు ఇటీవల పోలీసులకు సమాచారం అందించగా ఈ దారుణం గురించి వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ అపార్ట్మెంట్లో కొద్ది రోజులుగా దుర్వాసన రాసాగింది. ఎక్కడో ఎలుక చచ్చిపోయిందని అపార్ట్మెంట్లోని వాళ్లు భావించారు. పనివాళ్లను పిలిపించి అపార్ట్మెంట్ అంతా శుభ్రం చేయించారు. అయినా దుర్వాసన పోలేదు. కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. చివరకు వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ మొదటి అంతస్తులోని ఓ ఫ్లాట్ తలుపులను పోలీసులు బలవంతంగా తెరిచి లోపలికెళ్లి చూశారు. అక్కడ వారికి ఓ భయానక దృశ్యం కనిపించింది. తల్లీ కూతుళ్ల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. దీంతో, అపార్ట్మెంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తూర్పు ఢిల్లీలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.
ఆ మృతదేహాలు తల్లీకూతుళ్లవని పోలీసులు గుర్తించారు. 64 ఏళ్ల రాజ్రాణి తన కూతురు జిన్నీ కరార్(39)తో కలిసి నివసించేదని చుట్టుపక్కల వారు చెప్పారు. జిన్నీ మానసిక వ్యాధి ఉందని, ఆ తల్లికూతుళ్లు పగటి పూట బయటకు వచ్చేవారు కాదని తెలిపారు. రాత్రి సమయాల్లో మాత్రం డెలివరీ బాయ్స్ అప్పుడప్పుడూ వచ్చి వెళుతుండేవారు. అయితే, జిన్నీకి చికిత్స చేసేందుకు ఓ స్పీచ్ థెరపిస్ట్ వచ్చే వెళ్లేవారని కూడా చెప్పారు.
రాజ్రాణి భర్త లోక్సభ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసి రిటైరయ్యారు. నాలుగేళ్ల క్రితమే ఆయన చనిపోయారు. రాజ్రాణి పెద్ద కూతుళ్లకు పెళ్లిళ్లు కావడంతో వారు వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్రాణి తన మూడో కూతురితో అక్కడ నివసించేది. ఆ తల్లీ కూతుళ్లు చుట్టుపక్కల వారితో ఎక్కువగా కలవకపోవడంతో వారి గురించి ఇతర ఫ్లాట్ల వారికి పెద్దగా తెలియదు. దీంతో, ఆ మహిళలు మరణించి రోజులు గడిచిపోయినా ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాలేదు. అయితే, మృతదేహాల ఉన్న స్థితిని బట్టి మహిళలను ఎవరో హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలూ కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.