Vani Jayaram Death : వాణీ జయరామ్ మృతిపై అనుమానాలన్నీ ఒక్క మాటతో పటాపంచలు చేసిన పోలీసులు.. అసలేం తేలిందంటే..

ABN , First Publish Date - 2023-02-05T19:03:28+05:30 IST

సుప్రసిద్ధ సినీ నేపథ్యగాయని వాణి జయరాం (Vani Jayaram) (78) మృతిపై ఎలాంటి సందేహం లేదని చెన్నై నగర పోలీసులు (police) స్పష్టం చేశారు. పడక గదిలో కిందపడటం ..

Vani Jayaram Death : వాణీ జయరామ్ మృతిపై అనుమానాలన్నీ ఒక్క మాటతో పటాపంచలు చేసిన  పోలీసులు.. అసలేం తేలిందంటే..

చెన్నై: సుప్రసిద్ధ సినీ నేపథ్యగాయని వాణి జయరాం (Vani Jayaram) (78) మృతిపై ఎలాంటి సందేహం లేదని చెన్నై నగర పోలీసులు (police) స్పష్టం చేశారు. పడక గదిలో కిందపడటం వల్లే ఆమె మృతి చెందారని వారు వెల్లడించారు. బెడ్రూంలో ఆమె కింద పడటంతో తలకు బలమైన గాయం తగలడం వల్లే ప్రాణం పోయిందని ఫోరెన్సిక్‌ నిపుణులు (Forensic experts) నివేదిక ఇచ్చారని పోలీసులు తెలిపారు. వాణి జయరాం ఇల్లు ఉండే అపార్టుమెంట్‌ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించినప్పటికీ ఎక్కడా కూడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదన్నారు. వాణి జయరాం మృతి చెందిన ఇంటిని చెన్నై (Chennai), ట్రిప్లికేణి అసిస్టెంట్‌ కమిషనర్‌ దేశ్‌ముఖ్‌ శేఖర్‌ సంజయ్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. అయితే, శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ముగిసిన అంత్యక్రియలు

వాణి జయరాం అంత్యక్రియలు (funeral) ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. చెన్నై బీసెంట్‌ నగరులో ఉన్న విద్యుత్‌ దహన వాటికలో ఆమె కుటుంబ సభ్యులు పూర్తిచేశారు. అక్కడ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి, ఆమెకు నివాళులు అర్పించారు. అంతకుమందు ఆమె పార్థివదేహానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, వాణి జయరాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో పూర్తిచేస్తామన్నారు. పద్మభూషణ్‌ అవార్డును స్వీకరించకుండానే వెళ్ళిపోవడం బాధగా ఉందన్నారు. ఆ తర్వాత వాణి జయరాం అంతిమ యాత్ర నుంగంబాక్కంలోని హాడ్డోస్‌ లేన్‌లో ఉన్న ఆమె నివాసం నుంచి బీసెంట్‌ నగరు శ్మశానవాటిక వరకు కొనసాగింది. దారిపొడవున సినీ అభిమానులు అమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, వాణి జయరాం తన పెళ్ళి రోజైన ఫిబ్రవరి నాలుగో తేదీన కన్నుమూశారు. ఈమెకు 1968, ఫిబ్రవరి 4వ తేదీన జయరాంను పెళ్ళి చేసుకున్న విషయం తెల్సిందే.

దేవుడు పిలిచినట్టున్నారు: పి.సుశీల

సహచర గాయనీమణి వాణిజయంరాం మృతిపై మరో సుప్రసిద్ధ గాయని పి.సుశీల ఆదివారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమకంటే మంచి గాయనీమణి వాణి అన్నారు. ‘ఆమె మరణించిన వార్తను నాకు ఎవరూ చెప్పలేదు. హైదరాబాద్‌లో ఉన్న తన మనవరాలు ఆదివారం ఉదయం ఫోన్‌ చేసి.. ఒక విషాదకర వార్త.. వాణి జయరాం ఇకలేరు అని చెప్పడంతో షాక్‌కు గురయ్యాను. మా అందరికంటే కూడా మంచి గాయని. ఏక సంతాగ్రహి. ఆమెను నవ్వించడం మాతరమయ్యేది కాదు. నాతో పాటు సినీ ప్రపంచం ఒక మంచి గాయనిని కోల్పోయింది. ఆమె మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు. దేవుడు పిలిచినట్టున్నారు. ఆమె భర్తను కలుసుకుని కుంటారు’ అని సుశీల అన్నారు.

Updated Date - 2023-02-05T19:06:09+05:30 IST