Tallapragada Vishwa Sundaramma: ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకే.. ఆరునెలల జైలు శిక్ష అనుభవించింది..!

ABN , First Publish Date - 2023-03-06T10:40:23+05:30 IST

రచయిత్రిగా, ఉద్యమకారిణిగా మెరిసింది.

Tallapragada Vishwa Sundaramma: ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకే.. ఆరునెలల జైలు శిక్ష అనుభవించింది..!
Tallapragada Vishwa Sundaramma

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత అయిన తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గురించి చెప్పుకోవలసి వస్తే చాలా విశేషాలున్నాయి. ఈమె మార్చి 6వ తేదీ, 1899న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం తాలూకాలోని ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించింది. సుందరమ్మకు తన తొమ్మిదవ ఏటనే తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహం జరిగింది. అంత చిన్న వయసులో వివాహం అంటే అప్పటి రోజుల్లో అది మామూలే అయినా, సుందరమ్మ తనలోని ప్రతిభకు పదును పెట్టింది. రచయిత్రిగా, ఉద్యమకారిణిగా మెరిసింది. తనలోని ప్రతిభతో సాహిత్య శిరోమణి, భాషా ప్రవీణ పరీక్షలు రాసింది. 16 సంవత్సరాలకు భర్త దగ్గరకు వచ్చింది. ఆకాలంలో నరసింహశర్మ పిఠాపురం రాజావారు నడిపే అనాథ శరణాలయానికి సూపరింటెండెంటుగా పని చేస్తున్నాడు.

స్వాతంత్ర్య ఉద్యమంలోకి..

1921లో విశ్వ సుందరమ్మ దంపతులిద్దరూ రాజకీయాల వైపు ఆకర్షితులై, విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు హాజరయ్యారు. అప్పటి నుంచి విదేశీ వస్త్ర బహిష్కరణ, వస్తు బహిష్కరణ వంటి కార్యక్రమాలలో పొల్గొన్నారు. 1921లో అహమ్మదాబాద్ కాంగ్రెస్‌కు వెళ్ళి, అక్కడ సబర్మతీ ఆశ్రమంలోని గాంధీజీని దర్శించుకున్నారు. తిరిగివచ్చిన తరువాత రాజమండ్రి ప్రాంతంలో గోదావరి తీరాన, ఆనంద నికేతనాశ్రమం 1923లో స్థాపించారు. అస్పృశ్యతా నివారణ, స్త్రీ జనాభ్యుదయం, నూలు వడకడం, ఖాదీ నేయడం, అనాథలను ఆదరించడం వంటి కార్యక్రమాలు ఈ ఆశ్రమం ఆధ్వర్యంలోనే జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడా విశ్వ సుందరమ్మ దంపతులిద్దరూ చురుకుగా పాల్గొని 1930లో జైలుకు వెళ్ళి ఆరునెలల పాటు శిక్షను అనుభవించారు.

రచనా రంగం..

సుందరమ్మ రాసిన 125 పద్యాలను ఆమె మరణానంతరం, 1973లో ఆమె సోదరులు కవితా కదంబం అనే పేరు మీద సంపుటిని ప్రచురించారు. వైతాళికులు సంకలనంలోనూ సుందరమ్మ కవితలు ప్రచురితమయ్యాయి. కవయిత్రిగా, వక్తగా, ఉద్యమకారిణిగా స్వాతంత్ర్య ఉద్యమంలో సుందరమ్మ పాత్ర చాలా ముఖ్యమైనది.

ఈ విధంగా స్త్రీల కవిత్వం జాతీయోద్యమ ఆదర్శాలను, జాతీయోద్యమంలో క్రియశీల పాత్ర వహించిన వ్యక్తుల చరిత్రను గౌరవాభిమానాలతో నమోదు చేసిందనే చెప్పాలి. సాహిత్య ఉద్యమంతో ముడిపడి తన కవితా శక్తిని వికసింపచేసిన స్త్రీ తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ. 1942 జూలైలో క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. అందులోకి భిన్నవర్గాల ప్రజా సమూహాలను కలుపుకొని రావాలని గాంధీ ఆకాంక్షించారు. అందులో భాగంగానే జాతీయెద్యమంలోకి స్త్రీల సమీకరణ ఆనాడు ఒక ప్రధాన కార్యక్రమం అయ్యింది. ఆ నేపథ్యంలో తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ రచనా వ్యాసాంగం ఆనాటి కాలంలో ఆమె రచనలు అప్పటి ప్రజల్లో ఓ ప్రభంజనం.

Updated Date - 2023-03-06T10:40:23+05:30 IST