NRI: ఆరో తరం భారత సంతతి వారూ అందుకు అర్హులే.. ఎన్నారైలకు భారత రాష్ట్రపతి గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2023-06-06T21:36:17+05:30 IST

సురినామ్‌లోని ఆరో తరం భారతీయులు కూడా ఓసీఐ కార్డు పొందేందుకు అర్హులేనంటూ భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా ప్రకటించారు.

NRI: ఆరో తరం భారత సంతతి వారూ అందుకు అర్హులే.. ఎన్నారైలకు భారత రాష్ట్రపతి గుడ్ న్యూస్!

ఎన్నారై డెస్క్: సురినామ్ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి భారతీయులకు ఓ శుభవార్త చెప్పారు. ఓసీఐ కార్డు అర్హతలను మరింతగా సరళిస్తున్నట్టు పేర్కొన్న రాష్ట్రపతి, ఇకపై అక్కడి ఆరో తరం భారత సంతతి వారు కూడా ఓసీఐ కార్డు పొందేందుకు అర్హులని ప్రకటించారు.

సురినామ్‌లో భారతీయులు కాలుపెట్టి 150 ఏళ్ల పూర్తయిన సందర్భంగా అక్కడి ఇండిపెండెన్స్ స్క్వేర్ ప్రాంతంలో ఓ సాంస్కృతిక సభ నిర్వహించారు. ఈ సభలో రాష్ట్రపతి ముర్ముతో పాటూ సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్ సంతోఖీ కూడా పాల్గొన్నారు. భారత్‌లో బ్రిటీష్ పాలన సాగుతున్న సమయంలో 1873 జూన్ 5న సుమారు 452 మంది భారతీయులున్న ఓ నౌక సురినామ్ తీరంలో దిగింది. బీహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు అప్పట్లో పొట్టచేతపట్టుకుని వెళ్లారు. నాటి నుంచి సురినామ్-భారత్ మధ్య బంధం బలపడేందుకు అక్కడ స్థిరపడ్డ భారతీయులు కీలక పాత్ర పోషించారు.

కాగా, 150 ఏళ్ల చరిత్ర కలిగిన భారత్-సురినామ్ బంధంలో ఓసీఐ కార్డుది ముఖ్యపాత్ర అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. భారత్‌లో తమ బంధాన్ని కొనసాగించేందుకు అక్కడ స్థిరపడ్డవారు ప్రయత్నించాలని పేర్కొన్నారు. మునుపటి నిబంధనల ప్రకారం, సురినామ్‌లోని నాలుగో తరం భారత సంతతి వారికి మాత్రమే ఓసీఐ కార్డు జారీ చేసేవారు.

Updated Date - 2023-06-07T18:50:20+05:30 IST