NRI: సింగపూర్‌లో భారీ నగదును గెలుచుకున్న భారతీయుడు!

ABN , First Publish Date - 2023-06-01T20:49:12+05:30 IST

సింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం అనూహ్యంగా కలిసొచ్చింది. తాను పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఇటీవల నిర్వహించిన ఓ సరదా ఆటల పోటీలో గెలిచిన అతడు సుమారు 14 వేల డాలర్లు గెలుచుకున్నాడు.

NRI: సింగపూర్‌లో భారీ నగదును గెలుచుకున్న భారతీయుడు!

ఎన్నారై డెస్క్: సింగపూర్‌లో పనిచేస్తున్న ఓ భారతీయుడికి అదృష్టం అనూహ్యంగా కలిసొచ్చింది. తాను పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం ఇటీవల నిర్వహించిన ఓ సరదా ఆటల పోటీలో గెలిచిన అతడు సుమారు 14 వేల డాలర్లు గెలుచుకున్నాడు. కేరళకు చెందిన సెల్వం అరుముగమ్ సింగపూర్‌లోని పోలిసమ్ ఇంజినీరింగ్ అనే సంస్థలో పనిచేస్తున్నాడు. 2015లో అతడు ఆ కంపెనీలో చేరాడు. కాగా, ఇటీవల కాలంలో మంచి లాభాలు గడిస్తున్న ఆ సంస్థ ఉద్యోగులకు తన లాభాల్లో వాటా ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకోసం తన ఉద్యోగుల కోసం ఓ సరదా ఆటల పోటీని నిర్వహించింది. నెట్‌ఫ్లిక్స్‌లో బాగా పాపులర్ అయిన స్క్విడ్ గేమ్‌ ఆధారంగా ఓ చిన్న సరదా ఆట రూపొందించింది.

అయితే, సెల్వానికి ఈ ఆటకు సంబంధించిన నిబంధనలు ఏమీ తెలియవు. అయితే, తనకంటే ముందు బరిలోకి దిగిన వారిని చూస్తూ అప్పటికప్పుడు ఆట నేర్చుకున్న అతడు విజయం సాధించాడు. ఆటలో నిర్వహించిన పరుగుల పందెంలో గెలిచి విజేత అయ్యాడు. దీంతో, కంపెనీ అతడికి సుమారు 14 వేల డాలర్లు బహుమతిగా ఇచ్చింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు 11 లక్షలకు సమానం. తన జీవితంలో ఎన్నడూ ఎరుగని మొత్తాన్ని గెలుచుకున్న సెల్వం ఆనందానికి అంతేలేకుండా పోయింది. ఈ విషయాన్ని అతడు తన భార్యా పిల్లలకు చెప్పడంతో వారు కూడా తెగ సంబరపడిపోయారు.

Updated Date - 2023-06-02T05:58:56+05:30 IST