ఆమె రాగానికి ఎల్లలు లేవు
ABN , First Publish Date - 2023-06-14T23:53:51+05:30 IST
భిన్న భాషల్లో పాడడం గాయకులకు కొత్తేమీ కాదు. కానీ ఈ పదిహేడేళ్ల అమ్మాయి ఏకంగా నూట ఇరవై భాషల్లో రాగమెత్తుకుంది.
భిన్న భాషల్లో పాడడం గాయకులకు కొత్తేమీ కాదు. కానీ ఈ పదిహేడేళ్ల అమ్మాయి ఏకంగా నూట ఇరవై భాషల్లో రాగమెత్తుకుంది. గిన్నిస్ రికార్డును తన పేరున లిఖించుకుంది. ఇది గతం. తాజాగా ప్రముఖ గాయకుడు త్సెరింగ్ డోర్జీతో కలిసి భూటానీస్ పాటకు గొంతు కలిపింది. సంగీతానికి ఎల్లలు లేవని మరోసారి నిరూపించింది కేరళ కుట్టి సుచేత సతీష్.
‘‘నాది భిన్నమైన నేపథ్యం. ప్రపంచంలోని భిన్న సంస్కృతుల సమ్మేళనమైన దుబాయ్లో నేను పుట్టి పెరిగాను. వివిధ దేశాల వారితో పరిచయంవల్ల వారి సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోగలిగాను. అదే నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది. వినూత్నమైన దారిలో నడిచేందుకు ప్రేరణ ఇచ్చింది. కేరళలోని కన్నూరు మా స్వస్థలం. మా నాన్న సతీష్ డెర్మటాలజిస్ట్. అమ్మ సుస్మిత. చాలా ఏళ్ల కిందట మా కుటుంబం దుబాయ్ వచ్చి స్థిరపడింది. నేను చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ రాగాలు తీస్తుండేదాన్నిట. అది చూసి వారు మురిసిపోయేవారట. సంగీతం నేర్పిస్తే బాగుంటుందనుకున్నారట. అలా మూడేళ్ల వయసులోనే నన్ను సంగీత శిక్షణా తరగతుల్లో చేర్పించారు. కర్ణాటక సంగీతం... తరువాత హిందుస్థానీ సంగీతం కూడా నేర్చుకున్నా. ఇలా ఊహ తెలిసినప్పటి నుంచి సంగీతంతోనే సహవాసం.
ప్రపంచ రికార్డు...
సంగీతంలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ క్రమంగా పట్టు సాధించాను. ఎప్పుడూ కచేరీలు, పాటలకే పరిమితం కాకుండా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నాను. అందుకు ఏంచేయాలి? ఆ ఆలోచనే నన్ను ప్రయోగాల వైపు అడుగులు వేయించింది. ఒక్క మళయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా పాటలు సాధన చేశాను. దాని కోసం నా చుట్టూ ఉన్న వివిధ దేశాలు, రాష్ట్రాల వారి సహకారం తీసుకున్నాను. ముఖ్యంగా పదాల ఉచ్చారణ ఎలా ఉండాలనేది తెలుసుకున్నాను. ఇతర భాషల్లో నా పాట విన్నవారు బాగా పాడుతున్నావంటూ అభినందించారు. దాంతో నా మీద నాకు నమ్మకం కలిగింది. 2018 జనవరి. అప్పుడు నా వయసు పన్నెండేళ్లు. దుబాయ్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ వేదికపై 102 భాషల్లో ఆరు గంటల పదిహేను నిమిషాల పాటు ఏకధాటిగా పాటలు పాడాను. ఒక బాలిక నిర్వహించిన సుదీర్ఘ లైవ్ కన్సర్ట్గా అది రికార్డులకు ఎక్కింది. అది నాలో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది.
‘గిన్నిస్’ కోసం...
అయితే నా దృష్టంతా గిన్నిస్ బుక్ రికార్డు మీదే ఉంది. దాని కోసం మూడేళ్లు శ్రమించాను. 2021 ఆగస్టు... దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ వేదికగా ‘మ్యూజిక్ బియాండ్ బోర్డర్స్’ పేరుతో ‘రికార్డు’ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. ఏడు గంటల ఇరవై నిమిషాల్లో 120 భాషల్లో పాటలు పాడాను. అనుకున్నట్టుగానే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు నమోదైంది. దాంతో 2008లో 76 భాషల్లో కేశిరాజు శ్రీనివాస్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. నేను పాడిన పాటల్లో 29 భారతీయ, 91 ప్రపంచ భాషలు ఉన్నాయి. విశేషమేమంటే ఆ కార్యక్రమంలో భూటానీస్ పాట కూడా పాడాను. అది చూసే ఇప్పుడు త్సెరింగ్ డోర్జీతో కలిసి ‘గావ్ మే గావ్ మే’ పాట పాడే అవకాశం లభించింది. ఇటీవలే ఈ పాటను విడుదల చేశారు. వాళ్లకు నా గాత్రం బాగా నచ్చింది. ముఖ్యంగా పరభాష అయినా లయ తప్పకుండా ఆలపించానని డోర్జీ అభినందించడం నాకు మధుర జ్ఞాపకం. నా ప్రతిభకు గుర్తుగా కేరళ ప్రభుత్వం 2021లో ‘ఉజ్వల బాల్యం’ అవార్డును ఇచ్చింది. ప్రస్తుతం నేను ప్రస్తుతం సంగీత దిగ్గజం జెర్రీ అమల్దేవ్ దగ్గర శిక్షణ తీసుకొంటున్నా. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మక ప్రదర్శనలతో ఆకట్టుకోవడమే నా లక్ష్యం.