Folk Songs : జానపద గీతాల రారాణి
ABN , First Publish Date - 2023-02-11T00:07:34+05:30 IST
‘‘పాట, ఆట ... ఈ మాటలు వినగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. నాలో అణువణువూ పరవశిస్తుంది’’ అంటారు రన్రెంసంగీ. సరదాతో సంగీత
‘‘పాట, ఆట ... ఈ మాటలు వినగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. నాలో అణువణువూ
పరవశిస్తుంది’’ అంటారు రన్రెంసంగీ. సరదాతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన
ఆమె... మిజో గీతాల పరిరక్షకురాలిగా మారారు. ముప్ఫయ్యేళ్ళుగా రన్రెంసంగీ సాగిస్తున్న కృషి
ఆమెకు పద్మశ్రీని తెచ్చిపెట్టింది.
మారుమూల ఈశాన్య రాష్ట్రం మిజోరంలో... రన్రెంసంగీ గురించి తెలియనివారు దాదాపు ఉండరు. ఆమెను మిజో సంస్కృతికి చిహ్నంగా చూస్తారు. ‘మిజో జానపద గీతాల రారాణి’ అని పిలుచుకుంటారు. ‘‘ఇందులో నా గొప్పతనమేం లేదు. నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నానంతే’’ అని వినయంగా చెబుతారు రన్రెంసంగీ. మిజోరంలోని సర్చిప్ జిల్లా కీటుమ్ గ్రామం ఆమె జన్మస్థలం. ఆమె తండ్రి పాటలు బాగా పాడేవారు. రన్రెంసంగీ వాటిని అనుకరించే ప్రయత్నం చేసేవారు. పెళ్ళిలాంటి వేడుకల్లో, చర్చి కార్యక్రమాల్లో వినిపించే పాటలన్నీ పాడాలను కునేవారు. ‘‘పాట వినిపించగానే గొంతు కలపడం, పాదం కదపడం అప్రయత్నంగా జరిగిపోయేది. అది ఎప్పుడు మొదలైందో నాకూ తెలీదు’’ అంటారామె.
అభిరుచే వృత్తిగా...
బాల్యంలో అభిరుచిగా మొదలైన గానం, నృత్యం ఆమె జీవితంలో విడదీయలేని భాగాలుగా మారిపోయాయి. తండ్రి దగ్గర ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, స్నేహితులు ఆమెలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించారు. ఆ తరువాత ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండాల్సిందే. ‘‘క్రమంగా సంగీతాన్ని వృత్తిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా’’ అని గుర్తుచేసుకున్నారు రన్రెంసంగీ. ఈలోగా ఆమె కుటుంబం ఆ రాష్ట్ర ప్రధాన నగరమైన అయిజోల్కు మారడంతో మంచి శిక్షణ తీసుకోవడానికి అవకాశం దొరికింది.అక్కడ మిజోరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ఆర్ట్స్ (ఐఎంఎ్ఫఎ-ఎం)లో చేరారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక... ఆలిండియా రేడియోలో బి గ్రేడ్ ఆర్టిస్టుగా గాన ప్రయాణం ప్రారంభించారు. ‘‘ఇప్పటివరకూ దాదాపు అరవై పాటలను రేడియో కోసం రికార్డ్ చేశాను. వాటిలో జానపద గీతాలు, భక్తి గీతాలు, ప్రణయ గీతాలు...’’ అని చెప్పారు రన్రెంసంగీ.
అదే నా లోకం...
ఆమె 1992లో మిజోరం రాష్ట్ర ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా చేరారు. అదే ఏడాది నుంచి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ‘‘మా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంగీత రీతులున్నాయి. నృత్యాల్లోనూ కొన్ని భిన్నమైన శైలులు ఉన్నాయి. ఇది మా సాంస్కృతిక వారసత్వం. రాబోయే తరాలకు అందించాలి. అరుదైన కళారూపాలను భద్రపరచడం నా ఉద్యోగంలో ఒక బాధ్యతగా ప్రారంభించినా... క్రమంగా అదే నా లోకం అయిపోయింది’’ అంటారు రన్రెంసంగీ. అప్పటి నుంచి ఆమె దేశవ్యాప్తంగా పర్యటించారు. మిజోరం జానపద గీతాలను, నృత్యరూపాలను ప్రదర్శించి, వాటికి ప్రచారం కల్పించడంతోపాటు... ఆసక్తి కలిగిన వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ముప్ఫై సంవత్సరాలుగా ఇది కొనసాగిస్తున్నారు. ‘‘ఇప్పుడు నాకు యాభై తొమ్మిదేళ్ళు. అయినప్పటికీ పద్ధెనిమిదేళ్ళ మా అమ్మాయితో పోటీ పడే ఉత్సాహం నాలో ఉంది.’’ అని చెప్పారామె. సంగీత రంగానికి అందించిన సేవలకుగాను ప్రభుత్వాల నుంచి, మిజో అకాడమీ ఆఫ్ లెటర్స్, కీటుమ్ యంగ్ మిజో అసోసియేషన్ లాంటి అనేక సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు. 2017లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. ఆమె దగ్గర శిక్షణ పొందిన ఎంతో మంది కళాకారులుగా రాణిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా మిజోరం సంస్కృతికీ, సంగీతానికీ దేశమంతటా ప్రాచుర్యం కల్పిస్తున్నందుకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. ‘‘నన్ను ‘పద్మశ్రీ’కి ఎంపిక చేశారని తెలిసినప్పుడు... ఒక వైపు ఆశ్చర్యం, మరో వైపు ఆనందం. నాలో ఉప్పొంగిన భావాలను వ్యక్తం చెయ్యడానికి నాకు తెలిసిన మాటలు సరిపోవు. కనీసం నేను నామినేషన్ కోసం దరఖాస్తు చెయ్యలేదు. అయినా నన్ను గుర్తించినందుకు సంతోషంగా ఉంది. నాకు లభించిన ఈ గౌరవం... స్థానికమైన కళలకూ, సంస్కృతికీ ప్రాచుర్యం కలిగించాలనే తపన ఉన్న ఇతర కళాకారులకు స్ఫూర్తి కలిగిస్తుందనుకుంటున్నా’’ అని రన్రెంసంగీ తన ఆకాంక్షను వెల్లడించారు.