Muhammad Pravartha: న్యాయశీలత

ABN , First Publish Date - 2023-01-19T22:53:39+05:30 IST

సంతానం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. తల్లితండ్రులు తమ సంతానం బాగుండాలని అనునిత్యం తపిస్తారు. ఎల్లప్పుడూ వారి గురించే ఆలోచిస్తారు.

Muhammad Pravartha: న్యాయశీలత

సందేశం

సంతానం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. తల్లితండ్రులు తమ సంతానం బాగుండాలని అనునిత్యం తపిస్తారు. ఎల్లప్పుడూ వారి గురించే ఆలోచిస్తారు. పిల్లలు అభివృద్ధి చెందాలనీ, ఉన్నతమైన చదువులు చదవాలనీ, గొప్ప హోదాలకు చేరుకోవాలనీ కోరుకుంటారు. వారు సంపన్నులు కావాలనీ ఆకాంక్షిస్తారు. అవసరమైనప్పుడు తమ పిల్లల కోసం ధర్మాన్ని తప్పడానికి వెనుతీయనివారు ఎందరో ఉంటారు. చాలాకొద్ది మంది మాత్రమే గొప్ప వంశం, సంపద, అధికారాల వల్ల కలిగే గర్వానికి దూరంగా ఉంటారు. అల్లాహ్‌ పట్ల భయభక్తులతో మెలుగుతారు. అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ చూపిన బాటలో తూచా తప్పకుండా నడుస్తారు. అటువంటి వారిలో అబ్దుల్‌ మలిక్‌ బిన్‌ బిన్‌ మర్వాన్‌ ఒకరు. రెండవ ఖలీఫా హజ్రత్‌ ఉమర్‌ పాలకునిగా ఉన్నప్పుడు... ఖాజీగా మర్వాన్‌ బాధ్యతలను నిర్వహించేవారు. మంచి వ్యక్తిగా మృదుస్వభావిగా, గొప్ప వక్తగా, క్రమశిక్షణ, ఉన్నత వ్యక్తిత్వం కలిగినవారిగా ఆయన ఖ్యాతి పొందారు.

ఒకసారి మర్వాన్‌ కుమారుడికి కొందరు వ్యక్తులతో కొట్లాట జరిగింది. ఇరుపక్షాలూ న్యాయం తమవైపే ఉందని భావించాయి. జరిగిన గొడవ గురించి మర్వాన్‌కు ఆయన కుమారుడు వివరించాడు. ‘‘ఈ వ్యవహారంలో నా వైపు సత్యం ఉందనుకుంటున్నాను. మీ న్యాయ స్థానంలో వ్యాజ్యం దాఖలు చేయవచ్చా?’’ అని అడిగాడు. ‘‘వేయవచ్చు’’ అన్నారు మర్వాన్‌. ఆయన కుమారుడు వ్యాజ్యం దాఖలు చేశాడు. తనే గెలుస్తానని ధీమాగా ఉన్నాడు. న్యాయమూర్తిగా ఇరు పక్షాల వాదనలను మర్వాన్‌ విన్నారు. తరువాత... తన కుమారుడికి వ్యతిరేకంగా తీర్పు వినిపించి, ఇంటికి వెళ్ళిపోయారు.

కొద్దిసేపటికి ఆయన కుమారుడు విచారంతో, బాధతో ఇంటికి వచ్చాడు. ‘‘నాన్నగారూ! ఆ వ్యాజ్యం గురించి నేను మీతో చర్చించకపోతే... తీర్పు నాకు వ్యతిరేకంగా వచ్చినా బాధపడేవాణ్ణి కాదు. మరి వ్యాజ్యం దాఖలు చేయవచ్చని ఎందుకు సలహా ఇచ్చారు?’’ అని అడిగాడు. అప్పుడు మర్వాన్‌ ‘‘ఆ గొడవ గురించి నువ్వు నాతో చర్చించినప్పుడే... నువ్వు సత్యం వైపు లేవని నాకు స్పష్టంగా తెలిసిపోయింది. ఆ విషయం నేను నీకు చెబితే, నువ్వు ప్రత్యర్థులతో ఒప్పందం చేసుకొనేవాడివి. న్యాయం కోరే హక్కును వారి నుంచి నువ్వు కచ్చితంగా కొల్లగొట్టేవాడివి. నా ప్రియమైన కుమారుడా! ఈ ప్రపంచంలో అందరికన్నా నిన్ను నేను ఎక్కువ ఇష్టపడతాను. కానీ నీకన్నా దైవ ప్రవక్త మహమ్మద్‌ను, ఆయన ఉపదేశించిన మార్గాన్నీ ఎక్కువ ఇష్టపడతాను. అల్లా్‌హకు భయపడతాను. ఈ లోకంలోని ప్రతి ఒక్కరి లెక్కలూ అల్లాహ్‌ తీసుకుంటాడు. ఆయన విశ్వాలకు ప్రభువు. దేశాల్ని పాలించే బాధ్యతలను న్యాయశీలులైనవారికి అందించాలని నేను అల్లా్‌హను ఎప్పుడూ వేడుకుంటూ ఉంటాను’’ అని చెప్పారు.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌, 9985747684

Updated Date - 2023-01-19T22:53:40+05:30 IST