Shiv Tattvam: హిమాలయాలు... శివతత్త్వం

ABN , First Publish Date - 2023-06-01T23:23:07+05:30 IST

ప్రాచీన కాలం నుంచి ఎందరో అవతార పురుషులకు, యోగులకు, ఋషులకు, సాధుసంతులకు సత్యాన్వేషణ కోసం సాగించే తపస్సు కోసం హిమాలయాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆ హిమాలయాల ప్రాశస్త్యం గురించి ఇలా వివరించారు:

Shiv Tattvam: హిమాలయాలు... శివతత్త్వం

సహజయోగ

ప్రాచీన కాలం నుంచి ఎందరో అవతార పురుషులకు, యోగులకు, ఋషులకు, సాధుసంతులకు సత్యాన్వేషణ కోసం సాగించే తపస్సు కోసం హిమాలయాలు ఆలంబనగా నిలుస్తున్నాయి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి ఆ హిమాలయాల ప్రాశస్త్యం గురించి ఇలా వివరించారు:

ఇప్పుడు హిమాలయ పర్వతాలు ఉన్న ప్రాంతం కొన్ని వేల సంవత్సరాల కిందట సముద్రంతో కప్పి ఉండేది. అమృతం కోసం దేవతలు, దానవులు చేసిన మధనంలో.. సముద్రం లోపల ఉన్న పర్వతం... భూభాగం మీదికి దూసుకువచ్చింది. ఇప్పటి ఎవరెస్ట్‌ పర్వతం అంత ఎత్తుకు ఎదిగి ఆగింది. భౌగోళికపరంగా చూస్తే... భూగోళంలో కుండలినీ శక్తి ఉన్న స్థానం భారతదేశం. ఆ శక్తి పవిత్రతను రక్షించే కోటగా ఎవరెస్ట్‌ పర్వత శ్రేణి ఏర్పడింది.

పరమశివుడి నివాస స్థానం హిమాలయాలు. మానవ శరీరంలోని సహస్రార చక్రంలో శివుడి అధిష్టాన పీఠం ఉంటుంది. అందుకనే సహజయోగ సాధకులు తమ దైనందిన జీవితంలో ధ్యానం ద్వారా సహస్రార చక్రాన్ని చేరుకొని, నిర్వికార స్థితిని పొందుతారు. ‘విశ్వం’ అనే దేహంలో హిమాలయాలే సహస్రార చక్రం. ఆ హిమాలయాల్లో గంగ, యమున, సరస్వతి నదులు ప్రవహిస్తాయి. వాటిని మానవ శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్న నాడులకు ప్రతీకలుగా చెప్పుకుంటాం.

భారతీయ సనాతన ధర్మాన్నీ, శాస్త్రాలనూ అనుసరించి... శివుడి నివాస స్థానమైన కైలాస పర్వతాన్ని కలిగి ఉన్న హిమాలయాలను మనం భగవత్‌ స్వరూపంగా ఆరాధిస్తాం. సృష్టికర్త అయిన ఆదిశక్తి మొట్టమొదట శివతత్త్వాన్ని స్థిరపరచాలనుకుంది. ఎందుకంటే అది లేకపోతే సృష్టిలో ఏదీ స్థిరంగా ఉండదు. ఆయన సంపూర్ణుడు. కాబట్టి మొదట మనం మనలో శివుణ్ణి స్థిరపరచుకోవాలి. ఆయన తమోగుణానికి అధిష్టాన దేవత. అతి శీతలంగా ఉంటాడు. చలనం లేని వాటన్నిటికీ ఆయనే దేవుడు. విశ్వ సృష్టి పరిణామక్రమంలో... దట్టమైన మంచుతో కప్పబడి ఉన్న భూమి... సూర్యుడివైపు కదిలింది.. దాంతో మంచు కరిగి, ఆ నీరు సముద్రంగా మారింది. అయితే ఒక చోట మంచు కరగలేదు. అది శివుడు స్థిరపడాల్సిన చోటు. అదే కైలాస పర్వతం. అక్కడ ఏడాదిలోని ఏ కాలంలోనూ మంచు కరుగదు. ఆ పర్వతాన్ని చూస్తే... ముఖం, కళ్ళు, ముక్కు... అన్నీ శివుడి రూపంలోనే కనిపిస్తాయి. దాని రూపురేఖల్లో ఎలాంటి మార్పూ ఉండదు. ఈ భూమి మీద జరిగే ప్రతిదాన్నీ సాక్షిగా వీక్షించడం కోసం... ఆయన అక్కడ కొలువయ్యాడు. దక్షిణాభిముఖుడై భారతదేశాన్ని చూస్తున్నాడు.

మనలో కూడా మొదట స్థిరపడేది శివతత్త్వమే. పిండం ఏర్పడినప్పుడు - దానిలో కొట్టుకుంటున్న గుండె స్పందన... శివతత్త్వానికి సూచన. గుండె ఆగిపోతే మన ఉనికి ఆగిపోతుంది. కాబట్టి మనలో ఉన్న, శివతత్త్వమైన ఆత్మను జాగ్రత్తగా చూసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. మన చిత్తాన్ని ఎప్పుడూ ఆత్మమీదనే ఉంచాలి. మనలోని ఆత్మను జాగృతం చేసుకోవాలి. అప్పుడు మీరు మీతో ఏకం అవుతారు. మనలోని ఈ ఆత్మే విశ్వవ్యాపితమైన పరమాత్మ శక్తి. మీరు ఆత్మతో ఒక్కటిగా ఎప్పుడు అవుతారో... అప్పుడు విశ్వవ్యాప్త చేతనాశక్తిగా మారుతారు. ఇది సహజయోగ సాధన ద్వారా నెరవేరుతుంది.

ఈ విశ్వమంతా ఉనికిలో ఉన్నా, లేకపోయినా... శివతత్త్వం మాత్రం ఉంటుంది. విశ్వమంతా తాను ఉనికిలో ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా శివతత్త్వంలోనే ఉంటుంది. మనం ఆధ్యాత్మికమైన ఉన్నతి పొందినా, సమూహంతో కలిసి ఉండే తత్త్వం లేకపోతే అది వ్యర్థం. అలాగే సత్సంగంలో జీవించే తత్త్వం ఉండి, ఆధ్యాత్మిక ఉన్నతి లేకపోయినా వృధాయే. ఆ రెండూ సరిసమానంగా ఉండాలి. దాని కోసం మనలో శివతత్త్వాన్ని పెంచుకోవాలి.

(శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా)

Updated Date - 2023-06-01T23:25:18+05:30 IST