Share News

Deepfake Issue: డీప్‌ఫేక్ వివాదం.. క్రియేటర్స్, ప్లాట్‌ఫామ్స్‌కి తప్పదు భారీ మూల్యం.. ఐటీ మంత్రి హెచ్చరిక

ABN , First Publish Date - 2023-11-23T13:40:33+05:30 IST

ఓ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు డీప్‌ఫేక్ సమస్యపై నిర్వహించిన తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన తరుణంలో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించిందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Deepfake Issue: డీప్‌ఫేక్ వివాదం.. క్రియేటర్స్, ప్లాట్‌ఫామ్స్‌కి తప్పదు భారీ మూల్యం.. ఐటీ మంత్రి హెచ్చరిక

Ashwini Vaishnaw: ఓ కీలక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు డీప్‌ఫేక్ సమస్యపై నిర్వహించిన తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన తరుణంలో.. ఈ వ్యవహారంపై ప్రభుత్వం వీలైనంత త్వరగా నియంత్రణ తీసుకురావాలని నిర్ణయించిందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొన్ని రోజుల్లోనే డ్రాఫ్ట్‌ని సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై పనిచేస్తున్న కంపెనీలతో సమావేశం అయిన తర్వాత ఐటీ మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘డీప్‌ఫేక్’ ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా మారిందని.. అటువంటి కంటెంట్‌కు జవాబుదారీతనం క్రియేటర్స్, ప్లాట్‌ఫామ్స్‌దేనని స్పష్టం చేశారు.


తమ సమావేశంలో భాగంగా నాలుగు కీలక అంశాలపై చర్చలు జరిపామని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. డీప్‌ఫేక్‌లను ఎలా గుర్తించవచ్చు? డీప్‌ఫేక్‌లను పోస్ట్ చేయకుండా వ్యక్తులను ఎలా నిరోధించవచ్చు? అలాంటి కంటెంట్ వైరల్‌గా మారకుండా ఆపొచ్చా? రిపోర్టింగ్ మెకానిజం ఎలా అమలు చేయబడుతుంది? అనే అంశాలపై చర్చలు జరిగినట్టు ఆయన వివరించారు. రిపోర్టింగ్ మెకానిజం అమలు చేస్తే.. ఏదైనా యాప్‌ లేదా వెబ్‌సైట్స్‌లో డీప్‌ఫేక్ వీడియోల్ని వినియోగదారులు గుర్తించినప్పుడు, దాని గురించి ప్లాట్‌ఫామ్స్, అథారిటీలకు హెచ్చరించవచ్చు. తద్వారా వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రజల్లో అవగాహన పెంచడం కోసం.. ప్రభుత్వం, పరిశ్రమలు, మీడియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

డీప్‌ఫేక్ వంటి కంటెంట్ కోసం కొత్త నియంత్రణ అవసరమని చర్చల ద్వారా స్పష్టమైందని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించిన పనులు తక్షణమే ప్రారంభమవుతాయని, మరికొన్ని వారాల్లో నిబంధనల రూపకల్పనను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. నిబంధనలను కొత్త రూల్స్ లేదా కొత్త చట్టం రూపంలో ప్రవేశపెట్టవచ్చని చెప్పారు. డీప్‌ఫేక్‌ క్రియేటర్స్, వాటిని హోస్ట్ చేసే ప్లాట్‌ఫారమ్‌లలో జవాబుదారీతనం ఉంటుందని.. డీప్‌ఫేక్‌లపై వెంటనే చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వైష్ణవ్ హెచ్చరించారు.

Updated Date - 2023-11-23T13:40:34+05:30 IST