వినవే బాల.. అక్రమాలు చాలా

ABN , First Publish Date - 2023-03-18T22:36:34+05:30 IST

అధికారంలో చూడాలి అయ్యవారి చిత్రాలు అనే వెనుకటికి ఓ సామెత ఉంది. ఇప్పుడు దానిని వైరా పురపాలకంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు నిజం చేసి చూపిస్తున్నారు. పైసలు ఇస్తే చాలు ఏదైనా చేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు.

వినవే బాల.. అక్రమాలు చాలా
గత ఏడాది డిసెంబరులో కూల్చివేయకముందున్న ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు

వైరా, మార్చి 18: అధికారంలో చూడాలి అయ్యవారి చిత్రాలు అనే వెనుకటికి ఓ సామెత ఉంది. ఇప్పుడు దానిని వైరా పురపాలకంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు నిజం చేసి చూపిస్తున్నారు. పైసలు ఇస్తే చాలు ఏదైనా చేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో చులకన అవుతున్నారు. ఇప్పటికే వైరా పురపాలకం అవినీతిమయంగా మారిందని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. తాజాగా జరిగిన ఘటన మరింత అభాసుపాలు చేస్తోంది. పురపాల కంలోని కొంతమంది మౌఖిక అనుమతితో స్వయంగా మునిసిపాలిటీ సిబ్బంది పర్యవేక్షణలో గత ఏడాది డిసెంబరులో 90వేల లీటర్ల నీటిసామర్థ్యం కల్గిన ఒక ఓహెచ్‌ఎస్‌ఆర్‌ వాటర్‌ట్యాంకును కూల్చివేశారు. ఇప్పుడు తాజాగా వాటర్‌ట్యాంకు కూల్చివేసిన వారెవరో విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి కమిషన ర్‌ బి.అనిత పోలీసులకు చేసిన ఫిర్యాదు చేశారు.

నాలుగు నెలల క్రితం

పదో వార్డులో వైరా-జగ్గయ్యపేట, మధిర ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి పక్కన గొల్లపూడి నర్సింహారావుకు చెందిన స్థలంలో 40 సంవత్సరాల కిందట 90వేల లీటర్ల నీటిసామర్థ్యం కల్గిన వాటర్‌ట్యాంకును నిర్మించారు. అది శిథిలావస్థకు చేరుకోవ డంతో దాన్ని తొలగించాలని అతడి కుమారుడు కృష్ణారావు మునిసిపాలిటీ పాలక వర్గాన్ని, కమిషనర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో గత ఏడాది డిసెంబ రు 12వతేదీన స్వయంగా మునిసిపల్‌ సిబ్బంది పర్యవేక్షణలోనే కూల్చివేశారు. ఇన్నా ళ్లూ ట్యాంక్‌ ఉన్న స్థలాన్ని యజమానికి అప్పచెపుతూ, దీంతో మునిసిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని ఓ కీలక ప్రజాప్రతినిధి ధ్రువీకరణ పత్రం కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు సదరు ప్రజాప్రతినిధి ఆ సంతకం తనది కాదని, ఎవరో ఫోర్జరీ చేశారని బుకాయిస్తున్నారు ఈ సమయంలోనే 16మంది కౌన్సి లర్లు వాటర్‌ట్యాంకు కూల్చివేతపై కలెక్టర్‌ గౌతమ్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన కలెక్టర్‌ ఆదేశాలతో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ స్ర్కాఫ్‌ను స్వయంగా మునిసిపాలిటీ వాహనాల్లోనే బయటకు తరలించారు. లక్షల విలువైన స్ర్కాఫ్‌ను ఔట్‌సోర్సింగ్‌కు చెందిన ఒక ఉద్యోగి విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ముడుపులు చేతుల మారాయని తెలుస్తోంది.

నాలుగునెలల నుంచి తెలియదా...!

వైరాకు కేవలం మూడుకిలోమీటర్ల దూరంలోనే ప్రధాన రహదారి పక్కన భారీ వాటర్‌ట్యాంకు లేని విషయం గురించి కమిషనర్‌కు తెలియదంటే ఆమె పర్యవేక్షణ ఎంత అధ్వానంగా ఉందోనని అర్థమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కమిషనర్‌ చేసిన ఫిర్యాదుతో వైరా పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేప ట్టారు. కృష్ణారావును విచారించగా పలు ఆధారాలు చూపించాడు.ముఖ్య ప్రజాప్రతి నిధి, అధికారి ఆదేశాలతోనే ఈ ట్యాంకును తొలగించినట్లు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వాంగ్మూలం ఇచ్చాడని సమాచారం. ఈ పరిణామాలు ఎటుదారితీస్తాయోననే దానిపై వైరాలో చర్చ జరుగుతుంది.

Updated Date - 2023-03-18T22:36:34+05:30 IST