ఈ వారం వివిధ కార్యక్రమాలు 12 02 2023
ABN , First Publish Date - 2023-02-13T00:10:13+05:30 IST
ఆత్మీయ సన్మానం, దళిత రచయితల సమ్మేళనం, ఉమ్మడిశెట్టి అవార్డు , రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం, ‘విస్మృత కళింగాంధ్ర సాహితీ ప్రభ’ ఆవిష్కరణ...
ఆత్మీయ సన్మానం
ఆచార్య బి. రామకృష్ణా రెడ్డికి భారత ప్రభుత్వం ప్రతిష్టాకరమైన ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించిన సందర్భంగా జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13 సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్లో ఆత్మీయ సన్మానం జరుగుతుంది. సభాధ్యక్షులు- జి. చెన్నకేశవరెడ్డి; ముఖ్య అతిథి- కొలకలూరి ఇనాక్; సభా ప్రారంభకులు- ఎన్. భక్తవత్సలరెడ్డి; విశిష్ట అతిథులు- గారపాటి ఉమామహేశ్వరరావు, కె. ఆశీర్వాదం, ఎన్. ఈశ్వర్ రెడ్డి; గౌరవ అతిథులు- ఎం.కె. రాము, గంటా జలంధర్ రెడ్డి, ఎం. శంకర్ రెడ్డి, బిట్టు వెంకటేశ్వర్లు, వి. సత్తిరెడ్డి, కె. సుధీర్ కుమార్, వై. రెడ్డి శ్యామల.
అమ్మంగి వేణుగోపాల్
దళిత రచయితల సమ్మేళనం
సాహిత్య అకాడమి నిర్వహణలో ఢిల్లీలో జరగ నున్న ‘ఆల్ ఇండియా దళిత్ రైటర్స్ మీట్’లో పాల్గొనేందుకు తెలుగు కవి శిఖామణికి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 20, 21 తేదీలలో జరిగే ఈ సమ్మేళనంలో భాగంగా జరిగే బహుభాషా కవి సమ్మేళనాల్లో శిఖామణి ఒక సదస్సుకు అధ్యక్షత వహించడంతోపాటు, స్వీయ దళిత కవితలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చదువుతారు.
దళిత రచయితల వేదిక, ఆం.ప్ర.
ఉమ్మడిశెట్టి అవార్డు
35వ ఉమ్మడిశెట్టి సత్యా దేవి సాహితీ అవార్డుకు 2022 సంవత్సరానికి గాను వసీరా ‘సెల్ఫీ’ కవితా సంపుటి ఎంపికైంది. ఈ అవార్డు న్యాయ నిర్ణేతలుగా: కొప్పర్తి వెంకట రమణ మూర్తి, నాళేశ్వరం శంకరం, మందరపు హైమవతి వ్యవహరించారు. అవార్డు పొందిన ‘సెల్ఫీ’ వసీరా మూడవ కవితా సంపుటి. వసీరా ‘సెల్ఫీ’ కవిత్వంలో సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకొనే ఒక అద్వితీయ దివ్యానుభవం కల్గుతుందని న్యాయ నిర్ణేతలు అభిప్రాయ పడ్డారు. త్వరలో అనంతపురంలో జరిగే సభలో కవికి అవార్డు ప్రదానం జరుగుతుంది.
ఉమ్మడి రాధేయ
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం
రంగినేని సుజాతా మోహన్ రావు ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు రంగినేని మోహన్ రావు తన తల్లి కీ.శే. రంగినేని ఎల్లమ్మ పేర జాతీయ స్థాయిలో ప్రతి ఏటా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను కథా పురస్కారం కోసం వచ్చిన కథా సంపుటాలను పరిశీలిం చిన న్యాయనిర్ణేతలు ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పుర స్కారం 2022’ కోసం చింతకింది శ్రీనివాసరావు కథా సంపుటి ‘ఉడుకు బెల్లం’ను ఎంపిక చేశారు. మార్చ్/ ఏప్రిల్ 2023లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేయ బడతాయి. వివరాలకు: 94416 77373.
మద్దికుంట లక్షణ్
‘విస్మృత కళింగాంధ్ర సాహితీ ప్రభ’ ఆవిష్కరణ
రాజాం రచయితల వేదిక ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 19 ఆదివారం ఉదయం 10 గంటలకు రాజాంలోని విద్యానికేతన్ పాఠశాలలో సాహితీ రత్నాకర, సాహిత్య వాచస్పతి దామెర వేంకట సూర్యారావు ‘విస్మృత కళింగాంధ్ర సాహితీ ప్రభ’ అనే గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అట్టాడ అప్పలనాయుడు (కథ, నవలా రచయిత, శ్రీకాకుళం), గంటేడ గౌరునాయుడు (కవి, రచయిత, పార్వతీపురం), తుర్లపాటి రాజేశ్వరి (రచ యిత్రి, బరంపురం), రామవరపు వేంకట రమణమూర్తి (రచయిత, విశాఖపట్నం), డా. కణుగుల సుధీర్ (ఫిజీషియన్, శ్రీకాకుళం) తదితరులు అతిథులుగా పాల్గొంటారు.
రాజాం రచయితల వేదిక