చర్చల సంస్కృతిని పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2023-06-01T02:07:57+05:30 IST

పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ‘ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు కేంద్రం’ అంటూ ప్రజాస్వామ్య దేవాలయాన్ని కొనియాడారు....

చర్చల సంస్కృతిని పునరుద్ధరించాలి

పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభిస్తూ ప్రధాని మోదీ ‘ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు కేంద్రం’ అంటూ ప్రజాస్వామ్య దేవాలయాన్ని కొనియాడారు. అయితే ఆ ఉత్సవానికి కొన్ని ప్రతిపక్షాలు గైర్హాజరు కావడం లోటే అయినప్పటికీ, వారి కారణాలు కూడా కొట్టిపారేయదగినవి కావు. పార్లమెంట్ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరనట్టే, పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ విధానం కూడా చర్చనీయాంశం అయ్యింది. ఏదియేమైనా ఆజాదీ అమృతోత్సవాల వేళ భారత్ నూతన సౌధం నుంచి సరికొత్త స్ఫూర్తితో ముందడుగు వేయాలి. అందుకు తగ్గట్టుగా చేపట్టాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. రానురానూ పార్లమెంట్‌లో ఆరోగ్యకరమైన చర్చల మాట అటుంచి అసలు చర్చలే తగ్గిపోతున్నాయి. తొలి సభకు, ప్రస్తుత 17వ లోక్‌సభకు చర్చాకాలం సగానికి కన్నా తక్కువ రోజులకు పడిపోయింది. ముఖ్యమైన ఆర్థిక బిల్లులు, ప్రాముఖ్యం కలిగిన బిల్లులు కూడా నిమిషాల్లో పాస్ అవుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు తమ మాటే నెగ్గాలన్న ధోరణికి కట్టుబడి, పట్టువిడుపులు ప్రదర్శించడం లేదు. లోతుగా పరిశీలించాల్సిన బిల్లుల్ని స్టాండింగ్ కమిటీలకు పంపే ఆచారం దూరమౌతుంది. అర్థవంతమైన చర్చల స్థానంలో వెంటనే వార్తలకెక్కగల ప్రసంగాలు, ఉద్వేగభరిత వ్యాఖ్యానాలు ముందువరసకు వస్తున్నాయి. వైరిపక్షాలు భిన్నకోణంలో ఒక సమస్యను, పరిష్కారాన్ని చూసి చివరకు ఒక ఉత్తమమైన నిర్ణయానికి రావడం చర్చల ముఖ్య ఉద్దేశ్యం. అలా చేస్తే ప్రజలకు, దేశానికి మేలు. ఇద్దరి గమ్యమూ

ఒకటే అయినప్పుడు చర్చలేవీ పక్కదారి పట్టవు. ఒకరినొకరు గౌరవించుకోవడం సాధ్యమౌతుంది. నూతన భవనంలో ఆ మంచి సంస్కృతిని పునరుద్ధరించుకోవాలి. అందుకు పార్లమెంట్‌లో నాయకుడుగా ప్రధాని మోదీ చొరవచూపాలి.

– డి.వి.జి. శంకర రావు

మాజీ ఎంపీ, పార్వతీపురం

Updated Date - 2023-06-01T02:07:57+05:30 IST