తరగతి గదిలో సమాజ మాలిన్యాలు

ABN , First Publish Date - 2023-09-02T01:29:15+05:30 IST

తమ పిల్లలు ర్యాంకర్లు కావాలి, విదేశాలలో స్థిరపడాలన్న ఆకాంక్ష మినహా వారు ఏపాటి సామాజిక అవగాహన కలిగి ఉన్నారు? జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను....

తరగతి గదిలో సమాజ మాలిన్యాలు

తమ పిల్లలు ర్యాంకర్లు కావాలి, విదేశాలలో స్థిరపడాలన్న ఆకాంక్ష మినహా వారు ఏపాటి సామాజిక అవగాహన కలిగి ఉన్నారు? జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించగలరా, లేదా? అని యోచించే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది.

రిటైర్ అవుతున్న ఉపాధ్యాయ మిత్రుడు ఒకాయన నిట్టూర్పుతో ఓ మాటన్నాడు! ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మన తరం అంతరించిపోతోంది. ఇక ఉన్న ఉపాధ్యాయులు ప్రైవేటు విద్యా వ్యవస్థలో చదువుకున్నవాళ్ళే! మనకు విద్య నేర్పిన గురువులు ఎంతో క్రమశిక్షణ ఇచ్చారు, వారి స్ఫూర్తితో మనం పనిచేశాం. కానీ, ఇప్పుడు తరగతి గదిని, విద్యార్థులను చూస్తే ఆవేదన కలుగుతోంది’.

నిజమే! ఆయన అన్న మాటలు అక్షర సత్యాలు. గతంలో ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యాసానికి మధ్య అనుబంధంగా ఉండేది ఒక్క నల్లబల్లే. ఈ రోజు అధునాతన తరగతి గదిలో నల్లబల్ల స్థానంలో రేడియో, టీవీ, కంప్యూటర్, కెవైసీ, శాటిలైట్ చానల్స్ లాంటి ఎన్నో నవీన దృశ్య, శ్రవణ పరికరాలు అందుబాటులో కొచ్చాయి. తరగతి గది ఎంతో వేగంగా అభివృద్ధి చెందాలి. కానీ, నా ఉపాధ్యాయ మిత్రుడు ఆవేదనతో ప్రస్తావించిన క్రమశిక్షణ, అధ్యయన సామర్థ్యం నేడు మచ్చుకు కూడా కానరావడం లేదు! అదిగో ఇక్కడే ఎక్కడో తరగతి గది అంటే గురుశిష్యుల మధ్య ఉదాత్త సంబంధాలు లయతప్పిన జాడలు కనిపిస్తున్నాయి.

గత కాలంలో విద్యార్థులు చదువుకుంటూ తల్లిదండ్రులకు పనిలో సహకరించేవారు, పాఠశాలలో కూడా పని అనుభవం కింద బడి తోటలో మొక్కల పెంపకంపై వారికి ఆసక్తి కల్పించేవారు. పాఠశాల ఆస్తిని అపురూపమైన ఉమ్మడి సంపదగా భావించేవారు. సమాజం నుంచి కొన్ని విలువలకు సైతం పెద్దపీట వేసేవారు. కుల, మత రహిత వివక్షకు తావులేని వాతావరణం ఉండేది. నూటికి 90శాతం పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పొందేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రైవేటు విద్యావ్యవస్థే మహా ప్రభావం చూపుతోంది.

మెజారిటీ విద్యార్థులలో ‘షార్ట్ టెంపర్’ కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే పాఠశాల ఆస్తులు, ధ్వంసం చేయడానికి సంకోచించడం లేదు. మరీ ప్రాథమిక విద్యాభ్యాసంలోనే ప్రేమల పేరుతో, శారీరక ఆకర్షణలకు గురికావడం కనిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల్లో ఇది ఒకింత ఎక్కువగా ఉండడం ఆశ్చర్యకరం.

ఎందుకిలా జరుగుతోంది? చాలా మంది అభిప్రాయం ఏమంటే, ఇది నైతిక విద్యాలోపం. వాస్తవంగా పాఠశాలల్లో నైతిక విద్య బోధించడం లేదా? 2009 విద్యాహక్కు చట్టంలోనే దీనికి పెద్దపీట వేశారు. నైతిక విద్య, పని విద్య, చిత్రలేఖనం, ఒరిగామీ ఇలా పాఠ్యప్రణాళికలోనే నాలుగు అంశాలు చేర్చినప్పటికీ, వాటికి కంటి తుడుపుగా మాత్రమే సిలబస్ కేటాయించారు. మాడ్యూళ్ళు రూపొందించారు. కానీ, 14ఏళ్ళు గడిచినా ఆయా సబ్జెక్టులకు ఉపాధ్యాయులను కేటాయించలేదు! కాకపోతే, శిక్షణ లేని విద్యావాలంటీర్లను తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని పాఠశాలల్లో నియమించారు. ఆయా అంశాల ప్రాధాన్యత రీత్యా తగిన సమయం కేటాయించలేదు, వాటిని పాఠశాలల్లో ప్రాధాన్యత లేని అంశాలుగానే భావిస్తున్నారు. చట్టబద్ధమైన నైతిక విద్య, విలువలు నేర్పడంలో విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

అనాదిగా నైతిక విద్య లేకపోయినా విద్యార్థి కొన్ని విలువలను, సాంప్రదాయాలను కుటుంబం నుంచి తన పరిసరాల నుంచి, సమాజం నుంచి అనుకరణ ద్వారా నేర్చుకునేవాడు. విద్యార్థి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో లేడు. వసతి గృహాలు, నిరంతరం ఉరుకుల పరుగుల తల్లిదండ్రులు, సినిమా, టెలివిజన్, టెలిఫోన్ మొదలైనవన్నీ విద్యార్థి జీవితాన్ని కట్టడి చేసి నిస్తేజంగా తయారుచేస్తున్నాయి. ఒక రకమైన బానిస సంస్కృతికి బందీగా మార్చి, విద్యార్థిని మూస పద్ధతిలోకి నెట్టివేస్తున్నాయి. ఫలితంగా చిన్న సవాలును కూడా విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. విద్యాలయాల్లోనూ బయటా విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. సమాజంలో క్షణికావేశ హత్యలు పెరిగిపోయాయి. సామాజిక జ్ఞానం ఉన్నా, లేకపోయినా పర్వాలేదు కానీ, తమ పిల్లలు ర్యాంకర్లు కావాలి, విదేశాలలో స్థిరపడాలి, ఇదే ఆలోచన తప్ప, వారు ఏపాటి సామాజిక అవగాహన కలిగి ఉన్నారు? జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించగలరా? లేదా? మానవీయ కోణంలో ఆలోచించగలరా? లేదా? అని యోచించే తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఫలితంగా డబ్బే సర్వస్వం అన్న వైపు యువత నెట్టబడుతూ ఉంది.

ఇటీవల కాలంలో గ్లోబలైజేషన్ మూలంగా ఈజీ మనీ, క్రేజీ జీవితం వైపు కొందరు యువత మళ్లుతున్నారు. దీంతో సమాజంలో మోసాలు చేస్తున్న వారి సంఖ్య, అంతే మోతాదులో మోసానికి గురౌతున్న వారి సంఖ్యా ఉంటోంది. ఈ స్థితికి బాధ్యులెవరు? ఈ ప్రశ్నకు సరిగా అమలు గాని విధానాన్ని అని లాభం లేదు. ఎందుకంటే, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మనదేశంలో పాలకవర్గాలు విద్యను వ్యాపారమయం చేశాయి. చదువును ఒక అమ్మకం సరుకుగా తయారు చేశాయి. దాంతో మన దేశంలో విద్య నేర్చుకొని ఇతర దేశాలకు వలస వెళ్ళి ఆయా దేశాల సేవల్లో తరిస్తున్నారు. ఒకప్పుడు మన నలంద, తక్షశిల, ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాలలో విదేశీ విద్యార్థులు కనిపిస్తే, నేడు మనమే ఇతర దేశాల విద్యాలయాల్లో విద్య, ఉపాధి కోసం దేబిరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా గాడితప్పిన వ్యవస్థలో లయ తప్పుతున్న విద్యార్థులను క్రమశిక్షణ, విలువలు ఉన్న బాట పట్టించేది ఎట్లా? ఈ విషయంలో మారాల్సింది చట్టాలే కాదు, ప్రభావిత సమాజం కూడా.

యన్. తిర్మల్

Updated Date - 2023-09-02T01:29:15+05:30 IST