హిందీ పేర్లు తప్ప ఆత్మలో మార్పు లేదు
ABN , Publish Date - Dec 28 , 2023 | 02:17 AM
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నగరాలు, ప్రాంతాలు పేర్లు మారాయి. ఒరిస్సా లాంటి రాష్ట్రం కూడా ఒడిసాగా మారింది. లక్నో, బొంబాయి, మద్రాసు, రాజమండ్రి లాంటి నగరాలు...
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నగరాలు, ప్రాంతాలు పేర్లు మారాయి. ఒరిస్సా లాంటి రాష్ట్రం కూడా ఒడిసాగా మారింది. లక్నో, బొంబాయి, మద్రాసు, రాజమండ్రి లాంటి నగరాలు కూడా ప్రాచీన నామాల మోజులో పడ్డాయి. ఇందులో స్థానీయత అంశం ప్రబలంగా ఉంది. అంతవరకూ బాగానే ఉంది. కాని పేర్లలో భాష తేడాలు, భారతీయత పేరిట ప్రచార ఆర్భాటాలతో నేరవిచారణ వ్యవస్థకి మూలమైన మూడు స్మృతుల (codes) ఆంగ్ల శీర్షికల్ని మార్చి హిందీ పేర్లు పెడుతూ బిల్లుల్ని పార్లమెంటు ఇటీవల ఆమోదించింది.
ఐపీసీని ‘‘భారతీయ న్యాయ (రెండవ) సంహిత’’ అని సీఆర్పీసీని భారతీయ నాగరిక్ సురక్ష (2వ) సంహిత అని, ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య (రెండవ) బిల్లు అని మార్చారు. భారత శిక్షాస్మృతి (Indian Penal Code), భారత సాక్ష్యాధార చట్టం (Indian Evidence Act), నేర విచారణ స్మృతి (Criminal Procedure) అనేవి మన దేశంలో సాధారణ ప్రజలకు కూడా తెలిసిన పేర్లు. ఐపీసీలో 302 సెక్షన్ అంటే హత్యానేరం అని, ఐపీసీ 420 సెక్షన్ అంటే చీటింగ్ అని పత్రికలు, సినిమాల ప్రభావంతో వంటిళ్లలోకి కూడా ప్రవేశించిన జ్ఞానం. 1860లో ఐపీసీ 1872 ఎవిడెన్స్ యాక్ట్ 1998లో సీఆర్పీసీ ప్రవేశపెట్టారు.
థామస్ బాంబిగ్టన్ మెకాలే ఆనాటి బ్రిటీష్ ఇండియా తొలి లా కమిషన్ ఛైర్మన్గా ఉండి ఈ చట్టాల్ని రూపొందించటంలో కీలక భూమిక పోషించారు. ఆ తర్వాత 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు కొన్ని ప్రత్యేకమైన సవరణలు చేశారు. అప్పుడు కొన్ని ప్రగతిశీలమైన మార్పులు జరిగాయి. ముఖ్యంగా 428వ సెక్షన్ ప్రకారం విచారణ కాలంలో ఖైదులో వున్న కాలాన్ని శిక్షా సమయంలో మినహాయించటం గొప్ప సంస్కరణ. అంతకుముందు కాలంలో సంవత్సరాల తరబడి విచారణ కాలంలో జైళ్లలో మగ్గిపోయి మళ్లీ తీర్పు తర్వాత సుదీర్ఘమైన జీవితాల్ని గడిపేవారు. వలస పాలనలో వందలాది మన స్వాతంత్య్ర సమరయోధులు ఈ అక్రమానికి గురయ్యారు. అలాగే హత్య లాంటి తీవ్రమైన నేరాలు విచారణ సెషన్స్ కోర్టులో జరగటానికి ముందు కిందిస్థాయిలో మేజిస్ట్రేటు కోర్టులో విచారణ జరిగి సరైన ఆధారాలు లేకుంటే అక్కడే విడుదలయ్యేవారు. ఈ ప్రక్రియలో బాధితులకి సరైన న్యాయం జరగలేదనే వ్యాఖ్యలు వినిపించేవట.
సాధారణంగా చట్టాల్లో లోతుపాతుల్ని చర్చించి అవసరమైన సంస్కరణల్ని లా కమిషన్ సూచిస్తుంది. ఆ మేరకు ఆయా చట్టాలకు ప్రభుత్వం సవరణ చేస్తుంది. కాని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన సహజ సిద్ధమైన అహంకారంతో ఈ సంప్రదాయాన్ని తిరస్కరించి ఈ క్రిమినల్ చట్టాల మార్పుకోసం పదవీ విరమణ చేసిన జిల్లా జడ్జి తారేజ, న్యాయవాది మహేష్ జఠ్మలాని, మరో లా ప్రొఫెసర్తో కూడిన ఒక కమిటీని నియమించి, ఆ కమిటీ నివేదిక కూడా బహిరంగపర్చకుండా హడావిడిగా పార్లమెంటుకు సమర్పించి దానిపై మొక్కుబడి ప్రజాభిప్రాయాన్ని కోరింది.
లోక్సభలో మాట్లాడుతూ కేంద్ర హోంశాఖా మాత్యులు అమిత్ షా ‘‘గత చట్టాలు బ్రిటీష్ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే చేయబడ్డాయని, ఇప్పటివి న్యాయాన్ని అందించే చట్టాలని’’ డాంబికాలు పలికారు. ‘‘మోదీ నాయకత్వంలో భారతీయ ఆత్మని ఈ చట్టాల్లో పొందుపరుస్తున్నామని, రాజ్యాంగ స్ఫూర్తిని నింపామని’’ కూడా పలికారు.
అబద్ధాలు చెప్పటంలో కూడా అంతరాలు పాటించటం షా గారి కుత్సితాన్ని తెలియజేస్తుంది. ఈ చట్టాల్ని ప్రవేశపెడుతున్న సందర్భంలో గాంధీ, వల్లభ్భాయ్ పటేల్, బాలగంగాధర తిలక్లు బ్రిటీష్ ప్రభుత్వం దేశద్రోహం కింద నిర్భంధించారని చెబుతూ సుదీర్ఘకాలం బ్రిటీష్ ప్రభుత్వంచే నిర్బంధించబడిన నెహ్రూని ప్రస్తావించకపోవటంలో ఇది వ్యక్తమవుతుంది.
పేర్లు హిందీలో వుండటం మినహా ఈ కొత్త చట్టాల్లో ప్రధానమైన మార్పులేమీ లేవు. గత స్మృతుల్లోని సెక్షన్లని జంబ్లింగ్ చేయటం తప్ప చెప్పుకోదగిన మార్పులేమీ లేవు. ఉదాహరణకి హత్యకు సంబంధించిన సెక్షన్లు పాత ‘స్మృతి’లో 299 నుంచి 311 వరకు వుంటే కొత్త ‘సంహిత’లో 98 నుండి 111 వరకు వున్నాయి. 302 కొత్త దానిలో 102 అయింది. కాకుంటే ‘రాజద్రోహం’ ‘దేశద్రోహం’గా మారింది. ఉపా, పోక్సో లాంటి చట్టాల్ని కొత్త ‘భారతీయ న్యాయ సంహిత’లో భాగంగా చేశాయి. ఇంత హడావుడి, ప్రచార ఆర్భాటాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఏమీ సాధించదలిచింది. హిందీని అంగీకరించటానికి ఏ మాత్రం ఇష్టపడని దక్షిణాది ప్రజలపై ఆ భాషను రుద్దటం తప్ప వేరే ఏమీ లేదు. పైగా అనేక రికార్డుల్ని, అందులోని డేటాని మార్చటానికి ధన వ్యయం, నేర న్యాయ విచారణలో భాగస్తులైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురికావటం తప్ప ఒరిగే ప్రయోజనమేమీ లేదు. సరైన చర్చ లేకుండా, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఈ హడావిడి ఎందుకు?
పైగా ఈ కొత్త చట్టాల్లో ప్రజా వ్యతిరేకమైన అప్రజాస్వామికమైన కొన్ని విషయాలు ఉన్నాయి. దర్యాప్తు సమయంలో కస్టడీ వ్యవధిని ఎక్కువ చేయటం, అనాగరికమైన ఒంటికొట్టు నిర్బంధాన్ని నిర్దేశించటం, నిందితులు లేకుండా నేర విచారణ చేయటం లాంటి ప్రమాదకరమైన అంశాలున్నాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348లో సుప్రీంకోర్టు కార్యకలాపాలన్నీ ఇంగ్లీషులోనే జరపాలని నిర్దేశిస్తుంది. దీన్ని మార్చే అధికారం ప్రభుత్వానికున్న మాట నిజమే గాని ఇంత హడావిడిగా పేర్లు మార్చటమంటే భారతీయ ఆత్మను చట్టాల్లో పొందుపరిచినట్లేనా? కులం, మతం పేర్లతో రచ్చరచ్చగా వున్న దేశం ఇక భాష పేరుతో కూడా సంఘర్షించుకోవాలా?
కొసమెరుపు : సంతోషించవలసిన విషయం ఏమిటంటే అటూ ఇటూ మార్చినా భారత శిక్షాస్మృతినే ఉంచారు. మనుస్మృతిగా మార్చలేదు. అదే మహాభాగ్యం.
చెరుకూరి సత్యనారాయణ