కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు

ABN , First Publish Date - 2023-04-26T00:58:48+05:30 IST

పీకాక్‌ క్లాసిక్స్‌ సంపాదకుడు ఎ. గాంధి వ్యాసం ‘సిపిఐ: తల ఎత్తుకుని నడుస్తుందా?’ (ఆంధ్రజ్యోతి-–15.04.2023) మీద స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది.

కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు

పీకాక్‌ క్లాసిక్స్‌ సంపాదకుడు ఎ. గాంధి వ్యాసం ‘సిపిఐ: తల ఎత్తుకుని నడుస్తుందా?’ (ఆంధ్రజ్యోతి-–15.04.2023) మీద స్థూలంగా ఏకాభిప్రాయం ఉంది. అయితే కమ్యూనిస్టు పార్టీ చేసిన మరికొన్ని ప్రధానమైన తప్పిదాలను ఈ వ్యాసం విస్మరించింది.

చర్చలోనికి వెళ్ళడానికి ముందు ఒక అంశాన్ని స్పష్టం చేయాలి. కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు. ప్రపంచంలో ఎక్కడయినా సరే అణగారిన సమూహాలు తమ కష్టాల నుంచి విముక్తి చెందడానికి సమానత్వాన్ని కోరుకుంటాయి. వాళ్ళకు కార్ల్ మార్క్స్ తెలియకపోవచ్చు, కమ్యూనిస్టు ప్రణాళిక తెలియకపోవచ్చు. స్వభావ సిద్ధంగానే వాళ్లు సమానత్వాన్ని అభిమానిస్తారు. వాళ్ళను ‘ఆర్గానిక్ కమ్యూనిస్టులు’ అనాలి. కమ్యూనిస్టు పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఆ పార్టీల నాయకులు ఆర్గానిక్ కమ్యూనిస్టులంతటి సాత్వికులు కాదు.

బ్రిటీష్ ఇండియాలో కమ్యూనిస్టు పార్టీ 1920లో ‘ఇండియన్ కమ్యూనిస్టు పార్టీగా’ తాష్కెంటులో పుట్టింది. ఖిలాఫత్ ఉద్యమం నుంచి ఉత్తేజితులైన కొందరు ముస్లిం యువకులు దీని స్థాపనకు చొరవ తీసుకున్నారు. 1925 డిసెంబరు 26న కాన్పూరు సభలో దీనిని ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా’ (సీపీఐ)గా మార్చారు. ఒక అంతర్జాతీయ సంస్థకు దేశీయ శాఖగా ఉండడం గొప్ప ఆదర్శం అనుకుని ఉండవచ్చుగానీ ఇదొక జాతీయ తప్పిదం. ఒక వైపు, భారత కమ్యూనిస్టు పార్టీల నాయకుల్ని అంతర్జాతీయ కమ్యూనిస్టు నాయకులు నియంత్రించడానికీ, మరోవైపు, సృజనాత్మకత లోపించిన భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులు కీలక సందర్భాల్లో అంతర్జాతీయ నాయకుల ‘రోడ్ మ్యాప్’ల మీద ఆధారపడడానికీ ఈ పేరు తోడ్పడింది.

కొంతకాలం రష్యా మార్గం, కొంతకాలం చైనా మార్గం అంటూ ఒక శతాబ్దం గడిపేశారే తప్ప భారత మార్గం ఒకదాన్ని రూపొందించాలనే స్వతంత్ర ఆలోచనే భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఇప్పటివరకు రాలేదు. అంతర్జాతీయ నాయకులు సైతం సీపీఐ నాయకుల డొల్లతనాన్ని తమకు అనుకూలంగా బాగా వాడుకున్నారు. జాతీయోద్యమంలో నిర్ణయాత్మక ఘట్టంగా మారిన క్విట్ ఇండియా ఉద్యమంలో సీపీఐ పాల్గొనకుండ రజనీ ఫామే దత్ లాంటి బ్రిటీష్ కమ్యూనిస్టు నాయకులు తప్పుదోవ పట్టించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యాకు బ్రిటన్ మిత్రపక్షంగా మారినందున ఇండియాలో బ్రిటీష్ వ్యతిరేక పోరాటం తప్పు అన్నారు. చైనాలో ఇలాంటి సందర్భాలొచ్చినపుడు మావో ఇలా చేయలేదు. అక్కడ ఆయన జాతీయ నాయకుడనిపించుకున్నాడు; ఇక్కడ మనవాళ్ళు జాతి వ్యతిరేకులని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంతాచేసి స్టాలిన్ గానీ, మావోగానీ భారత కమ్యూనిస్టు నాయకుల్ని గౌరవించింది ఏమీలేదు. స్టాలిన్ భారత ప్రతినిధి బృందంతో కాసేపయినా మాట్లాడాడుగాని మావో కనీసం ప్రతినిధి బృందాన్ని కలవనైనాలేదు.

భారత శాసన వ్యవస్థ ఒక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రూపకల్పన చేస్తున్న కాలంలో, 1948 ఫిబ్రవరిలో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో బిటీ రణదివే అట్టహాసంగా ‘సాయుధపోరాట’ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కోల్పోయిన పరువును తిరిగిపొందడానికి కావచ్చు, లేదా చైనా నుంచి అందుకున్న కొత్త ఉత్తేజంతో కావచ్చు, సీపీఐ ఇలాంటి ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి అప్పటికి ఏడాదిన్నర ముందు నుంచే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు జిల్లాల్లో సీపీఐ రాష్ట్ర సమితి సాయుధ పోరాటాన్ని సాగిస్తోంది. విచిత్రంగా, జాతీయ సమితి సాయుధ పోరాట పిలుపు ఇచ్చిన ఏడు నెలల్లోపే ఈ రాష్ట్ర సమితి పోరాట విరమణ ప్రకటన చేసింది. ఎవరి లక్ష్యాలు నెరవేరినట్టు ఈ రాష్ట్ర సమితి భావించింది అనేది ఇప్పటికీ పరిశీలనాంశమే.

నిజాం సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడం ఇటు భారత, అటు నిజాం సంస్థానాల్లోని పెట్టుబడిదారీ – భూస్వామ్యవర్గాల అవసరం. దాని కోసం వాళ్ళు పది మార్గాల్లో పది పార్టీలు పది సంస్థల ద్వారా ప్రయత్నించారు. వారు ఎంచుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ, ఆర్యసమాజం, బ్రహ్మసమాజం వగైరాలున్నాయి. ఆ జాబితాలో కమ్యూనిస్టు పార్టీ కూడ ఒకటి. తమ కార్యకలాపాలు నల్గొండ, వరంగల్ (అప్పటికి ఖమ్మం జిల్లా లేదు) జిల్లాల్లోని కొన్ని తాలూకాల్లో కొనసాగాయని సీపీఐ చెప్పుకోవచ్చు. నిజాం మెడలు వంచి ఇండియన్ యూనియన్‌లో చేర్చింది తామే అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం మాత్రం అతిశయోక్తి.

నిజాం విలీనంతో భారత–నిజాం పెట్టుబడీదారీ – భూస్వామ్యవర్గాల అవసరం తీరింది. ఆర్యసమాజ్ ఆశయం నెరవేరింది. కాంగ్రెస్ రాజకీయ లక్ష్యం పూర్తయింది. కమ్యూనిస్టులు ప్రచారం చేసిన ‘తెలంగాణలో రైతుకూలీ రాజ్యం’ మాత్రం రాలేదు. ఎవరిది విజయం? ఎవరిది పరాజయం? ఆర్యసమాజ్ సాంస్కృతిక లక్ష్యానికీ, కాంగ్రెస్ రాజకీయ లక్ష్యానికి కమ్యూనిస్టు పార్టీ ఆమోదాంశాన్ని కలగజేసిందంటే ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు.

మన శాసనకర్తలు భూస్వాములు–ఆశ్రిత పెట్టుబడిదారుల్ని ప్రోత్సహిస్తుంటారని మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాము. అది తప్పు. భూస్వాములు–పెట్టుబడిదారులే శాసన వ్యవస్థను (crony legislature) ఏర్పాటు చేస్తారనే వాస్తవం ఇటీవల మరీ నగ్నంగా బయటపడిపోయింది. 1952 నాటి తొలి సార్వత్రక ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీచేసిన రావి నారాయణ రెడ్డికి జవహర్ లాల్ నెహ్రూకన్నా అధిక ఓట్లు పడ్డాయని కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికి గొప్పగా చెప్పుకుంటుంటాయి. సకాలంలో పోరాట విరమణ ప్రకటన చేసి, తమ ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చి పెట్టినందుకు భూస్వాములు–పెట్టుబడిదారులు ఆయనకు ఇచ్చిన బహుమానం అది అంటే చాలా మందికి మింగుడు పడదు.

బ్రిటీష్ ఇండియాలో దాదాపు 560 ప్రిన్స్‌‍లీ స్టేట్స్ ఉండగా నిజాం సంస్థానంలో మాత్రమే ఎందుకు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారూ అన్నది ఎవరికైనా రావలసిన ప్రశ్న. ఆ సంస్థానాల కన్నా నిజాం పరిపాలన క్రూరమైనది అనేది తార్కిక వాదన కావచ్చుగానీ వాస్తవం అది కాదు. విద్యా, వైద్య–ఆరోగ్య, నీటిపారుదల, రైల్వే, విద్యుత్తు తదితర రంగాలన్నింటిలోనూ నిజాం మిగిలిన సంస్థానాలన్నింటికన్నా ముందున్నది. ఇంకేదో కారణం ఉండాలి.

రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడాన్ని ఆనాటి కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రముఖులు మఖ్ధూం మోహియుద్దీన్, దేవులపల్లి వేంకటేశ్వరావు (డివి) తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళూ మరికొందరు 1951 వరకు పోరాటాన్ని సాగించారు. ‘తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర (1946–1951)’ శీర్షికతో డివి రెండు భాగాల గ్రంథం రాశారు. ఆ గ్రంథం 1988 జూలై నాటి తొలి ముద్రణ మొదటి భాగం 590–91వ పేజీల్లో చాలా ఆసక్తికర పరిశీలనలు ఉన్నాయి.

నిజాం ఫ్యూడజలిజాన్ని వ్యతిరేకించడంలో మతం ప్రభావం బాగా పనిచేసిందని వారు చాలా స్పష్టంగా వివరించారు. ‘ఫ్యూడల్ వ్యతిరేకతకన్నా ముస్లిం వ్యతిరేకతే (కమ్యూనిస్టు) పార్టీ నాయకత్వంలో ప్రధానంగా పనిచేసింది. హిందూ భూస్వాములు సహజంగా నిజాంకు వ్యతిరేకంగా ఉంటారు కనుక వారి భూముల్ని (పేదలకు) పంచకుడదని వారు (కమ్యూనిస్టు పార్టీ నాయకులు) వాదించారు’. తెలంగాణలో ‘విప్లవోద్యమం ముందుకు వచ్చిందంటే ఇక్కడి పార్టీ దీని కొరకు చేసిన కృషి ఫలితమే. తక్కినచోట్ల (హిందువులు అధినేతలుగావున్న సంస్థానాల్లో) ముందుకు పోలేదంటే అక్కడి పార్టీ దాని కోసం కృషి చేయకపోవడమే కారణం. వాస్తవ పరిస్థితి అనుకూలంగా లేక కృషి చేయలేదా? అనుకూలంగా ఉండి కూడ కృషి చేయలేదా? అంటే ఉండి కూడా కృషి చేయలేదనే చెప్పవలసి ఉంటుంది’. ఇటువంటి చేదు నిజాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

ముస్లింలు అనేకాదు; భారత కమ్యూనిస్టు పార్టీల నాయకులకు ఏ అస్తిత్వ సమూహాలూ నచ్చవు. ఒక అమూర్త శ్రామిక వర్గం గురించి మాత్రం వాళ్ళు తరచూ మాట్లాడుతుంటారు. సమాజంలో శ్రామికవర్గం కూడ ఏదో ఒక అస్తిత్వంలో ఉండి తీరుతుందంటే వాళ్ళు ఒప్పుకోరు. ‘మనుషుల సామాజిక అస్తిత్వమే వాళ్ళ చైతన్యాన్ని నిర్ణయిస్తుంది’ అన్న మార్క్స్ మాటలు వీరికి కూడ వర్తిస్తాయి.

అధికారంలో లేనపుడు కమ్యూనిస్టుపార్టీలు శ్రామిక అనుకూల విధానాలను వల్లె వేస్తుంటాయి. శాసనసభలో ప్రవేశించడానికి నూతన ఆర్థిక విధానాన్ని సమర్థించే రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాయి. ఇవన్నీ బహిరంగమైపోయాక కార్మికవర్గం సహా సకల అస్తిత్వ సమూహాలు కమ్యూనిస్టు పార్టీలను వదిలేస్తున్నాయి. ఈ ఫలితాలను మనం పార్లమెంటరీ రాజకీయరంగంలో చూస్తున్నాం.

మేధోరంగంలో కమ్యూనిస్టుల ప్రభావం ఇప్పటికీ బలంగా సాగుతోంది. రాజకీయ, ఆర్థిక, సాంఘీక విమర్శను కమ్యూనిస్టులు గొప్పగా అభివృద్ధి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు తమ హక్కుల గురించి మాట్లాడే చొరవను కమ్యూనిస్టు పార్టీలే ఇచ్చాయి. ఈ సంస్థల తొలినాయకులంతా పూర్వాశ్రమంలో కమ్యూనిస్టులే. ఇప్పటికీ వాళ్ళ వాదనల్లో మార్క్సియన్‌ మెథడాలజీయే బలంగా కనిపిస్తుంది.

ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తున్నదని అణగారిన సమూహాలు భయపడుతున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం ఆందోళనకర అంశమే. అయితే, ఆర్గానిక్ కమ్యూనిస్టులు సమీప భవిష్యత్తులో ఏకమై చారిత్రక అవసరంగా ఒక కొత్త కమ్యూనిస్టు పార్టీని ఏర్పరచుకోవచ్చు.

డానీ

సీనియర్ జర్నలిస్ట్‌

Updated Date - 2023-04-26T00:58:48+05:30 IST