అడ్డుకట్ట అవసరం!

ABN , First Publish Date - 2023-06-01T01:55:37+05:30 IST

వారణాసిలోని జ్ఞానవాపి–శృంగార గౌరి వివాదంలో ఆరునెలలుగా రిజర్వులో ఉంచిన తీర్పును బుధవారం అలహాబాద్‌ హైకోర్టు వెలువరించింది....

అడ్డుకట్ట అవసరం!

వారణాసిలోని జ్ఞానవాపి–శృంగార గౌరి వివాదంలో ఆరునెలలుగా రిజర్వులో ఉంచిన తీర్పును బుధవారం అలహాబాద్‌ హైకోర్టు వెలువరించింది. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్సులోని శృంగారగౌరి ఆలయంలో నిత్యపూజలు చేసుకోవడంపై ఐదుగురు హిందూమహిళలు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత ఉన్నదని కోర్టు ప్రకటించింది. ఆ పిటిషన్‌ను కొట్టివేయమంటూ యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డు, మసీదు కమిటీ చేసుకున్న ఉమ్మడి అభ్యర్థనను హైకోర్టు కొట్టివేస్తూ, వారణాసి జిల్లా కోర్టులో ఈ పిటిషన్‌ విచారణ కొనసాగేందుకు అనుమతినిచ్చింది. గత ఏడాది వారణాసి కోర్టు తీసుకున్న నిర్ణయాన్నే హైకోర్టు కూడా ఇప్పుడు సమర్థించినందున హిందూ మహిళల తరఫున వాదించిన న్యాయవాదులు, విహెచ్‌పి నేతలు సంతోషిస్తున్నారు. అర్చించుకొనే హక్కుకోసం పోరాడుతున్న మహిళల పక్షాన హైకోర్టు నిలబడిందని, అతిత్వరలోనే అక్కడ ఒక భారీ శివాలయం నిర్మాణానికి ఈ తీర్పు బాటలు వేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. జరుగుతున్న మతయుద్ధంలో ఈ తీర్పు ఒక మైలురాయి అని, ఇప్పుడున్న నిర్మాణాన్ని కూల్చి అక్కడ ఆలయాన్ని కట్టేరోజులు దగ్గరలోనే ఉన్నాయని ఒక న్యాయవాది ప్రకటించారు.

కాంప్లెక్సులోని శృంగారగౌరి సహా ఇతర దేవీదేవతల నిత్య ఆరాధన హక్కుకోసం రెండేళ్ళక్రితం ఐదుగురు మహిళలు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్‌ వేసినప్పుడు, 1991నాటి ప్రార్థనాస్థలాల యథాతథస్థితి చట్టం దీనికి కూడా వర్తిస్తుందనీ, దాని ప్రకారం పిటిషన్‌ విచారణ అధికారం స్థానికకోర్టుకు లేదని మసీదు కమిటీ వాదించింది. ఈ కేసులో ఆ చట్టం వర్తించదన్న వారణాసికోర్టు అభిప్రాయాన్నే అలహాబాద్‌ హైకోర్టు కూడా సమర్థించిన నేపథ్యంలో, స్థానిక కోర్టులో విచారణ సాగేందుకు అడ్డంకులేమీ లేనట్టే. వారు పూజకు అనుమతిమాత్రమే అడుగుతున్నారు తప్ప, వివాదాస్పద ప్రాపర్టీమీద యాజమాన్య హక్కులు కాదు అంటూ వారణాసికోర్టు గత ఏడాది సెప్టెంబరు నాటి తీర్పులో వ్యాఖ్యానించింది. వివాదాస్పద ప్రాంతాన్ని గుడిగా ప్రకటించాలని వారేమీ డిమాండ్‌ చేయడం లేదని గుర్తుచేసింది. కానీ, జ్ఞానవాపి చుట్టూ సాగుతున్న పరిణామాలు, అలుముకున్న వివాదాల సారాన్ని గమనించినప్పుడు అంతిమలక్ష్యం స్పష్టంగానే అర్థమవుతుంది. స్థానికకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు మధ్య కేసులు తిరుగుతూ, వాదోపవాదాలు సాగుతున్నప్పడల్లా వాతావరణం వేడెక్కుతూనే ఉంది. గత ఏడాది మేనెలలో శివలింగాకారంలోని ఒక నిర్మాణం వెలుగుచూసినప్పుడు వారణాసి కోర్టు దాని శాస్త్రీయ అధ్యయనాన్ని తిరస్కరిస్తే, కార్బన్‌ డేటింగ్‌కు అలహాబాద్‌ హైకోర్టు పురావస్తుశాఖను అనుమతించింది. దీనికి సంబంధించి సాగిన వాదోపవాదాలకు తోడుగా, దానిని ఎలా చేపట్టాలన్న విషయంలో న్యాయస్థానానికి ఉన్నతస్థాయి సంస్థల వివిధ సలహాలు, సూచనల గురించి మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. కోర్టు ఆదేశించిన వీడియో రికార్డుల్లో కనిపించింది ఇదీ అంటూ చాలా విడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. జ్ఞానవాపి కేసులో తొందరపాటు కూడదు, జాగ్రత్త అవసరం అని ఇటీవల సుప్రీంకోర్టు ఓ వ్యాఖ్యచేస్తూ, ఆ సైంటిఫిక్‌ సర్వే వాయిదా వేసింది. కానీ, దిగువస్థాయికోర్టులు తమపనితాము చేసుకుపోతూనే ఉన్నాయి. అయోధ్యను మినహాయించి మిగిలిన ప్రార్థనాస్థలాలన్నింటికీ 1947 ఆగస్టు 15 స్థితిని వర్తింపచేస్తూ పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రార్థనాస్థలాల ప్రత్యేకచట్టం తెచ్చినప్పటికీ ఫలితం లేకపోతున్నది. దీనిని సవాలు చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి వంటివారు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ కూడా కేంద్రప్రభుత్వ వైఖరి కారణంగా ముందుకు సాగడం లేదు. అయోధ్య ముగిసింది, ఇంకా చాలా మిగిలింది అంటూ బీజేపీ నాయకులు నినదిస్తున్న నేపథ్యంలో, ప్రత్యేకచట్టాన్ని నిగ్గుతేల్చేలోగా ప్రార్థనాస్థలాలకు సంబంధించిన ఏ కేసులనూ దిగువకోర్టులు చేపట్టకుండా సర్వోన్నతన్యాయస్థానం నిలువరించాల్సిన అవసరం చాలా ఉంది.

Updated Date - 2023-06-01T01:55:37+05:30 IST