మేట్టూరు సమీపంలో ఆమ్నీ బస్సు దగ్ధం

ABN , First Publish Date - 2023-01-31T10:11:14+05:30 IST

మేట్టూరు సమీపం పుదుచ్చాంపల్లి వద్ద కోయంబత్తూరు నుంచి బెంగళూరు(Bangalore) వెళుతున్న ఆమ్నీ బస్సు ఉన్నట్టుండి దగ్ధమైంది

మేట్టూరు సమీపంలో ఆమ్నీ బస్సు దగ్ధం

- పది మందికి గాయాలు

చెన్నై, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మేట్టూరు సమీపం పుదుచ్చాంపల్లి వద్ద కోయంబత్తూరు నుంచి బెంగళూరు(Bangalore) వెళుతున్న ఆమ్నీ బస్సు ఉన్నట్టుండి దగ్ధమైంది. సోమవారం వేకువజాము ఒంటిగంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో కోయంబత్తూరుకు చెందిన దామోదరన్‌ (38), ఆయన భార్య వినోదిని (40), సంతోష్‌ (28) సహా పదిమంది గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి బయలుదేరిన ఆ బస్సు పుదుచ్చాంపల్లి వద్ద వెళుతుండగా బస్సు ముందుభాగంలో దట్టంగా పొగలు రావడం చూసిన డ్రైవర్‌ వెంటనే బస్సు నిలిపివేసి, ప్రయాణికులందరినీ కిందకు దిగమని కేకలు పెట్టాడు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో డ్రైవర్‌ కేకలకు నిద్రపోతున్న ప్రయాణికులంతా తమ లగేజీ కూడా తీసుకోకుండా ఒకరినొకరు నెట్టుకుంటూ కిందకు దిగారు. అదే సమయంలో బస్సు ముందుభాగంలో చెలరేగిన మంటలు నలువైపులా వ్యాపించాయి. వెంటనే బస్‌ డ్రైవర్‌ పోలీసులకు, అగ్నిమాపక దళానికి ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని గంటకు పైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆ బస్సు పూర్తి తగలబడిపోయింది. ఈ ప్రమాదంలో ముప్పావు శాతం మంది ప్రయాణికుల లగేజీ కాలిబూడిదైంది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో గంటసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కరుమలైకడల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2023-01-31T10:11:16+05:30 IST