సెల్కాన్ చేతికి టచ్ మొబైల్స్
ABN , First Publish Date - 2023-07-14T02:26:17+05:30 IST
మొబైల్ ఫోన్ల రిటైల్ విక్రయాలు, తయారీ, పంపిణీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెల్కాన్ గ్రూప్ ఫ్రాంచైజీ రిటైల్ స్టోర్ల రంగంలోకి అడుగుపెడుతోంది...
ఫ్రాంచైజీ రిటైల్ స్టోర్ల విభాగంలోకి అడుగు
మార్చి నాటికి 200 స్టోర్ల లక్ష్యం
సెల్కాన్ సీఎండీ వై గురు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మొబైల్ ఫోన్ల రిటైల్ విక్రయాలు, తయారీ, పంపిణీ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెల్కాన్ గ్రూప్ ఫ్రాంచైజీ రిటైల్ స్టోర్ల రంగంలోకి అడుగుపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో రిటైల్ స్టోర్లు కలిగిన టచ్ మొబైల్స్ను కొనుగోలు చేసింది. టచ్ మొబైల్స్కు 42 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీ ద్వారా ఫ్రాంచైజీ రిటైల్ స్టోర్ల రంగంలోకి ప్రవేశించనున్నామని సెల్కాన్ గ్రూప్ సీఎండీ వై గురు తెలిపారు. ప్రస్తుతం సెలెక్ట్ బ్రాండ్తో సొంత రిటైల్ స్టోర్లలో సెల్కాన్ గ్రూప్ మొబైల్స్, టీవీలు మొదలైన వాటిని విక్రయిస్తోంది. టచ్ మొబైల్స్ విస్తరణలో భాగంగా 50 వరకూ సొంత రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తాం. వీటితోపాటు ఫ్రాంచైజీ విధానంలో 2024 మార్చి నాటికి 200 స్టోర్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలలో ఏర్పాటు చేయనున్నాం. సొంత కాళ్లపై నిలబడి స్వయం ఉపాధి పొందే వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్రాంచైజీలను ఇవ్వనున్నాం. కనీసం రూ.15 లక్షల పెట్టుబడి పెడితే సరిపోతుంది. వ్యాపార వ్యూహం నుంచి సరఫరా వ్యవస్థ వరకూ మేమే చూసుకుంటామని చెప్పారు. 30,000-40,000 జనాభా ఉన్న చిన్న పట్టణాల్లో కూడా సంఘటిత రంగంలో మొబైల్ రిటైల్ స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నామని అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే 50 టచ్ మొబైల్స్ స్టోర్లలో కొన్ని మహిళలే నిర్వహించే స్టోర్లు ఉంటాయని సెల్కాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేతినేని మురళీ తెలిపారు. టచ్ మొబైల్స్ టర్నోవర్ రూ.200 కోట్లు ఉందని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.500 కోట్లకు పెంచాలని భావిస్తున్నామని అన్నారు.
మొబైల్, టీవీల రిపేర్లో శిక్షణ: మొబైల్ ఫోన్లు, టీవీల రిపేర్లో శిక్షణ ఇచ్చేందుకు ’సెల్కాన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ముందుగా దశల వారీగా 1,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు గురు తెలిపారు. శిక్షణ పొందిన వారు టచ్ మొబైల్స్ ఫ్రాంచైజీ స్టోర్ల యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని అక్కడే రిపేర్ సేవలను అందిస్తారు. స్వయం ఉపాధి పొందుతారని చెప్పారు. వీరు మొబైల్ తయారీ యూనిట్లలో పని చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ చదివిన వారికి శిక్షణ ఇస్తారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో సెల్కాన్ రూ.2,600 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ.5,000 కోట్లకు పెంచుకోనున్నామని అన్నారు.