వెండి ధర మరింత పైపైకి!
ABN , First Publish Date - 2023-09-15T04:03:01+05:30 IST
ప్రస్తుతం పసిడి కంటే వెండి ధర ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లోనే కిలో వెండి ధర 11 శాతం పెరిగింది. ప్రసుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.73,000 వరకు పలుకుతోంది..
మోతీలాల్ ఓస్వాల్ అంచనా
ఏడాది కాలంలో రూ.85,000 స్థాయికి
న్యూఢిల్లీ: ప్రస్తుతం పసిడి కంటే వెండి ధర ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లోనే కిలో వెండి ధర 11 శాతం పెరిగింది. ప్రసుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.73,000 వరకు పలుకుతోంది. డిమాండ్ ఇలానే కొనసాగితే వచ్చే 12 నెలల్లో కిలో వెండి ధర రూ.82,000 నుంచి రూ.85,000 స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేస్తోంది. ఒకవేళ తగ్గినా రూ.68,000 -70,500 వద్ద గట్టి మద్దతు లభిస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు ప్రతి తగ్గుదలలో వెండి కొనిపెట్టుకోవడం మంచిదని సిఫారసు చేసింది.
కలిసొచ్చే అంశాలు
సన్నగిల్లుతున్న ఆర్థిక మాంద్యం అంచనాలు
నగనట్రాతో పాటు పారిశ్రామిక రంగంలోనూ వెండికి గిరాకీ
సౌర విద్యుత్, విద్యుత్ వాహనాలు, 5జీ రంగాల్లో పెరుగుతున్న వెండి వినియోగం
బంగారంలా షేర్ల కంటే సురక్షిత పెట్టుబడిగా గుర్తింపు
ఆర్థిక పరిస్థితులు క్షీణించినా సురక్షిత పెట్టుబడిగా గుర్తింపు
కలిసి రానున్న పండగల సీజన్ కొనుగోళ్లు