లోహ, వాహన షేర్లలో కొనుగోళ్లు

ABN , First Publish Date - 2023-06-03T01:29:51+05:30 IST

వారాంతం ట్రేడింగ్‌లో ప్రామాణిక ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి.

లోహ, వాహన షేర్లలో కొనుగోళ్లు

119 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై: వారాంతం ట్రేడింగ్‌లో ప్రామాణిక ఈక్విటీ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు మెటల్‌, టెలికాం, ఆటో రంగ షేర్లలో కొనుగోళ్లకు పాల్పడటం ఇందుకు దోహదపడింది. దీంతో శుక్రవారం సెన్సెక్స్‌ 118.57 పాయింట్ల లాభంతో 62,547.11 వద్ద ముగియగా.. నిఫ్టీ 46.35 పాయింట్లు పెరిగి 18,534.10 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్‌ దాదాపు 2 శాతం ఎగబాకి సెన్సెక్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 0.60 శాతం, స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.57 శాతం పెరిగాయి. కాగా, ఈ వారం మొత్తానికి సెన్సెక్స్‌ 45.42 పాయింట్లు, నిఫ్టీ 34.75 పాయింట్ల లాభాన్ని నమోదు చేసుకున్నాయి.

కోల్‌ ఇండియా ఇష్యూ బంపర్‌ హిట్‌

ప్రభుత్వ రంగ బొగ్గు మైనింగ్‌ దిగ్గజం కోల్‌ ఇండియా లిమిటెడ్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ఇష్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.4,000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అంచనా. శుక్రవారంతో ముగిసిన రెండ్రోజుల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎ్‌స)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కంపెనీలోని 3 శాతం వాటాకు సమానమైన 18.48 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ రూ.225కు అమ్మకానికి పెట్టింది. కాగా, సంస్థాగత ఇన్వెస్టర్లు గురువారం 28.76 కోట్లు, శుక్రవారం మరో 5.12 కోట్ల షేర్ల కొనుగోలుకు బిడ్లు సమర్పించారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి 2.58 కోట్ల షేర్ల కొనుగోలు బిడ్లు లభించాయి. ప్రస్తుతం కోల్‌ ఇండియాలో 66.13 శాతం వాటా కేంద్రం చేతుల్లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - 2023-06-03T01:30:34+05:30 IST