పసిడి దూకుడు
ABN , First Publish Date - 2023-12-03T01:56:04+05:30 IST
బంగారం, వెండి ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి.
సరికొత్త రికార్డు స్థాయికి ధరలు
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.64,530
హైదరాబాద్లో రూ.63,760కి చేరిక
రూ.83,500కి పెరిగిన కిలో వెండి
హైదరాబాద్: బంగారం, వెండి ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. శనివారం నాడు చెన్నై మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.64,530కి చేరింది. మరోవైపు హైదరాబాద్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం శనివారం రూ.810 పెరిగి రూ.63,760కి చేరుకుంది. 22 క్యారెట్ల లోహం రేటు రూ.750 పెరుగుదలతో రూ.58,450గా నమోదైంది. కిలో వెండి కూడా రూ.1,000 పెరిగి రూ.83,500కు ఎగబాకింది.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఆల్టైమ్ రికార్డు స్థాయికి చేరడమే ఇందుకు కారణం. కాగా ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ 1.68 శాతం వృద్ధితో 2,091 డాలర్లకు ఎగబాకగా... సిల్వర్ 26 డాలర్లకు చేరువైంది. వచ్చే ఏడాదిలో ఫెడ్ రేట్ల తగ్గింపు ప్రారంభం కావచ్చన్న అంచనాలు ఊపందుకోవడం ఇందుకు కారణమైంది.