వంట నూనెల ధరలు తగ్గించాల్సిందే..

ABN , First Publish Date - 2023-06-03T01:40:03+05:30 IST

దేశంలో వంట నూనెల సెగ మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

వంట నూనెల ధరలు తగ్గించాల్సిందే..

కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం

లీటర్‌ రూ.12 వరకు తగ్గే అవకాశం

న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల సెగ మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. వెంటనే వీటి గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) లీటర్‌కు రూ.8 నుంచి రూ.12 వరకు తగ్గేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం పరిశ్రమ వర్గాలను ఆదేశించింది. ఈ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏఐ), ఇండియన్‌ వెజిటబుల్‌ ఆయిల్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ (ఐవీఐపీఏ) ప్రతినిధులతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా శుక్రవారం నిర్వహించిన ఒక సమావేశంలో ప్రభుత్వం ఈ విషయం స్పష్టం చేసింది. వంట నూనెల కంపెనీలు, రిఫైనరీలు పంపిణీదారులకు సరఫరా చేసే ధరలనూ వెంటనే తగ్గించాలని కోరింది. ఇలా చేస్తే ఆ ప్రభావం రిటైల్‌ మార్కెట్‌పైనా కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలకు స్పష్టం చేసింది. పంపిణీదారులకు సరఫరా చేసే వంట నూనెల ధరలు తగ్గించినప్పుడు.. ఆ లాభాన్ని కంపెనీలు వెంటనే తుది వినియోగదారులకూ చేరేలా చూడడంతో పాటు ఆ విషయాన్ని ప్రభుత్వానికీ తెలపాలని కోరింది.

ఎందుకంటే?

గత రెండు నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ప్రధాన వంట నూనెల ధరలు టన్నుకి 150 నుంచి 200 డాలర్లకు వరకు తగ్గాయి. దాంతో దేశీయ మార్కెట్లో కొన్ని కంపెనీలు లీటర్‌ సన్‌ఫ్లవర్‌, సోయా వంట నూనెల ధరను రూ.5 నుంచి రూ.15 వరకు తగ్గించాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఇంకా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగిందని భావిస్తున్నారు. లీటర్‌ వంట నూనెల ధర రూ.12 వరకు తగ్గితే రిటైల్‌ ద్రవ్యోల్బణమూ మరింత దిగి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో వీలైనంత వరకు వంట నూనెల ధరలను కట్టడి చేసే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని అధికార పక్షం భావిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-06-03T01:40:03+05:30 IST