మస్క్-అంబానీ స్పెక్ట్రమ్ వార్
ABN , First Publish Date - 2023-06-26T01:46:55+05:30 IST
అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం (శాటిలైట్) ద్వారా వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్కు అనుమతి ఇవ్వాలని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుండగా...
న్యూఢిల్లీ: అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం (శాటిలైట్) ద్వారా వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్కు అనుమతి ఇవ్వాలని ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుండగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అందుకు విరుద్ధమైన వాదం వినిపిస్తున్నారు. మస్క్ గత వారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో కలిసి తమకు లైసెన్స్ ఇస్తే చాలు.. సరైన మౌలిక వసతులు లేక ఇంటర్నెట్ కనెక్టివిటీ రాని మారుమూల గ్రామాలకు కూడా దాన్ని విస్తరిస్తామని తెలిపారు. స్టార్లింక్కు అనుమతి ఇవ్వాలని తప్పితే సిగ్నళ్లను వ్యాపింపచేయడానికి అవసరమైన స్పెక్ట్రమ్ కావాలని ఆయన కోరలేదు. తద్వారా అదే తరహా వాదం వినిపిస్తున్న టాటాలు, సునీల్ భారతి మిట్టల్, అమెజాన్ సరసన ఆయ న చేరారు. అయితే సాంప్రదాయిక టెలికాం కంపెనీలు స్వేచ్ఛగా పని చేసుకునే వాతావరణం కల్పించేందుకు వాయిస్, డేటా సర్వీసులు అందించడానికి ముందుకు వచ్చే విదేశీ ఉపగ్రహ సేవా కంపెనీలకు కూడా స్పెక్ట్రం వేలం వేయాలని అంబానీ అంటున్నారు. అమెజాన్ క్యూపర్, టాటా, ఎయిర్టెల్ మద్దతు గల వన్ వెబ్, ఎల్ అండ్ టీ స్పెక్ట్రం వేలంకు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా మాత్రం వేలం వేయాలని వాదిస్తున్నాయి. ప్రభుత్వంలోని కొందరు మాత్రం స్పెక్ట్రం వేలం తో పెట్టుబడులు వస్తాయని అంటున్నారు.