రియల్టీకి ఇది బూమ్ టైమ్
ABN , First Publish Date - 2023-03-22T01:21:32+05:30 IST
దేశంలో గత 15 సంవత్సరాలుగా స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్ మంచి జోరు మీద ఉందని హెచ్డీఎ్ఫసీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈఓ విపుల్ రుంగ్తా అన్నారు. నివాస గృహాల మార్కెట్ మరింత జోరు మీద ఉందని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో...
నివాస గృహాలకు మరింత డిమాండ్
హెచ్డీఎ్ఫసీ క్యాపిటల్ అడ్వైజర్స్
న్యూఢిల్లీ: దేశంలో గత 15 సంవత్సరాలుగా స్థిరాస్తి (రియల్టీ) మార్కెట్ మంచి జోరు మీద ఉందని హెచ్డీఎ్ఫసీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈఓ విపుల్ రుంగ్తా అన్నారు. నివాస గృహాల మార్కెట్ మరింత జోరు మీద ఉందని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో చెప్పారు. ప్రజల ఆదాయాలు పెరగడం, సొంతింటి ఆశలు ఇందుకు ప్రధాన కారణమన్నారు. రెరా, పెద్ద నోట్ల రద్దు తర్వాత తీవ్ర సమస్యలు ఎదురైనా, రియల్టీ రంగం ఈ రెండు సమస్యల నుంచి వేగంగానే బయట పడిందన్నారు. కొవిడ్ తర్వాత కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లతో పాటు నాణ్యతకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలిపారు. అందుబాటు ధరల గృహాలతో పాటు మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇదే సరైన సమయం అని రుంగ్తా చెప్పారు. గత ఏడాది కాలంగా వడ్డీ రేట్లు పెరిగినా, గృహాలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదన్నారు.
తగ్గనున్న ఆఫీస్ లీజింగ్: ఈ సంవత్సరం హైదరాబాద్తో సహా దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలు పెద్దగా ఉండక పోవచ్చని కొలియర్స్-ఫిక్కీ అంచనా. గత ఏడాది ఈ ఆరు నగరాల్లో 5.03 కోట్ల చదరపు అడుగుల (ఎస్ఎ్ఫటీ) ఆఫీస్ స్పేస్ లీజు ఒప్పందాలు జరిగాయి. ఈ సంవత్సరం అది 25 నుంచి 30 శాతం తగ్గి 3.5 నుంచి 3.8 కోట్ల ఎస్ఎ్ఫటీకి మించకపోవచ్చని ఈ రెండు సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదిక పేర్కొంది. మారిన పని విధానాలతో పాటు వ్యాపార ఆస్థిరత ఇందుకు కారణమని ఆ నివేదిక తెలిపింది.