ఎలక్ట్రిక్ వాహనాలపై జీఓసీఎల్ దృష్టి
ABN , First Publish Date - 2023-09-22T01:20:37+05:30 IST
సామర్థ్య వినియోగాన్ని పెంచుకోవడంతో పాటు విలువ చేర్చిన ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించాలని జీఓసీఎల్ కార్పొరేషన్ భావిస్తోంది. దీర్ఘకాల వృద్ధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయంగా చిప్ ఉత్పత్తి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సామర్థ్య వినియోగాన్ని పెంచుకోవడంతో పాటు విలువ చేర్చిన ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించాలని జీఓసీఎల్ కార్పొరేషన్ భావిస్తోంది. దీర్ఘకాల వృద్ధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, దేశీయంగా చిప్ ఉత్పత్తి మొదలైన వాటిపై భవిష్యత్తులో వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నట్లు వార్షిక సర్వసభ్య సమావేశంలో జీఓసీఎల్ పేర్కొంది. మౌలిక సదుపాయాలు, బొగ్గు, మైనింగ్, రక్షణ, ఎలకా్ట్రనిక్స్ రంగాల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం కంపెనీ వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయని భావిస్తోంది. మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వివిధ పరికరాలు, యాక్సెసరీలను తయారు చేస్తున్న జీఓసీఎల్ ఇటీవల ఈఎంఎస్ ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టింది. డిటొనేటర్లను తయారు చేయడంలో దేశంలోనే కంపెనీ అగ్రస్థానంలో ఉంది. 2022-23 ఏడాదిలో కంపెనీ రికార్డు స్థాయిలో రూ.1,410 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. నికర లాభం 20 శాతం పెరిగి రూ.211 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. మొత్తం విక్రయాల్లో ఎలకా్ట్రనిక్ డిటొనేటర్ల విక్రయాలు 36 శాతం మేరకు ఉన్నాయి. సొంత అనుబంధ కంపెనీ ఐడీఎల్ నిర్వహిస్తున్న ఎక్స్ప్లోజివ్స్ అండ్ క్యాట్రిడ్జెస్ టర్నోవర్ రూ.750 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రెట్టింపునకు పైగా పెరిగాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులను మరింతగా పెంచడానికి వ్యూహాత్మాక విధానాలను అనుసరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్లోని 44 ఎకరాల స్థలం విక్రయం పూర్తయింది. విక్రయం ద్వారా లభించిన నిధులను కంపెనీకి ప్రయోజనం చేకూరే విధంగా మదుపు చేశాం. బెంగళూరులో అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ‘ఈకోపోలిస్’ ద్వారా ఆదాయం పొందే అంశాలను పరిశీలిస్తున్నామని పేర్కొంది.