Share News

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో అంబానీకి చేరువలో అదానీ

ABN , First Publish Date - 2023-12-06T16:59:39+05:30 IST

కొన్నిరోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో అదానీ గ్రూప్ షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడు రోజుల కిందట 20వ స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం 82.5 బిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానంలో ఉన్నారు.

Gautham Adani: ప్రపంచ కుబేరుల్లో అంబానీకి చేరువలో అదానీ

ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల్లో తమ స్థానాన్ని ఒక్కసారిగా మెరుగుపరుచుకున్నారు. డిసెంబర్ 6న బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించిన జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నారు. అంతేకాకుండా ఆసియా తరఫున కుబేరుడిగా కొనసాగుతున్న రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీకి 82.5 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ చేరువలోకి వచ్చారు. కొన్నిరోజులుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంతో అదానీ గ్రూప్ షేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. అదానీకి చెందిన మొత్తం 10 కంపెనీలు స్టాక్‌లో లిస్ట్ కాగా.. గత మూడు రోజుల్లో ఆయా కంపెనీల స్టాక్స్ 50 శాతానికి పైగా పురోగతి సాధించినట్లు సమాచారం అందుతోంది. దీంతో ప్రపంచ కుబేరుల్లో మూడు రోజుల కిందట 20వ స్థానంలో ఉన్న అదానీ ప్రస్తుతం 15వ స్థానంలో ఉండటం గమనించాల్సిన విషయం.

కాగా ప్రస్తుతం ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ తొలి స్థానంలో కొనసాగుతున్నారు. 91.4 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో ఉన్నారు. అటు ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లలో మ్యానిప్యులేషన్, అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్డ్ రీసెర్చ్ ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లలో అదానీ షేర్లు 60 శాతం పతనం అయ్యాయి. దీంతో అదానీ సంపద 69 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ ప్రస్తుతం అదానీ కంపెనీల షేర్ విలువ క్రమంగా పెరుగుతోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 68 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 56 శాతం, అదానీ పవర్ 67 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 68 శాతం మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T17:45:47+05:30 IST