స్టార్టప్ల ప్రోత్సాహం ప్రపంచ బాధ్యత
ABN , First Publish Date - 2023-01-29T01:36:05+05:30 IST
ఆర్థిక మాంద్యం, వృద్ధి క్షీణత, పేదరికం, పర్యావరణం లాంటి సమస్యలతో ప్రపంచం అతలాకుతలం అవుతోందని...
జీ-20 దేశాల పరస్పర సహకారం కీలకం
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
స్టార్టప్లకు హబ్గా భారత్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ ప్రారంభమైన జీ-20 స్టార్టప్-20 సదస్సు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఆర్థిక మాంద్యం, వృద్ధి క్షీణత, పేదరికం, పర్యావరణం లాంటి సమస్యలతో ప్రపంచం అతలాకుతలం అవుతోందని, వీటన్నిటికి ఆవిష్కరణలతో పరిష్కారం చూపించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. జీ-20 దేశాలు సంయుక్తంగా పరస్పర సహకారంతో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించవచ్చన్నారు. భారత్ ఆతిథ్యమిస్తున్న జీ-20 సమావేశాల్లో భాగంగా స్టార్టప్-20 సన్నాహక సమావేశం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో పాటు 19 దేశాలు, మరో 9 ఆహ్వానిత దేశాల ప్రతినిధులు రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
ఢిల్లీ నుంచి వర్చువల్గా నిర్వహించిన సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సుస్థిరమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ప్రపంచ సమిష్టి బాధ్యత అని గోయల్ అన్నారు.
ఆవిష్కరణలే కీలకం
అమృత్కాల్లో అభివృద్థి చెందిన భారత దేశాన్ని నిర్మించడంలో ఆవిష్కరణలు బలమైన స్తంభంగా సహాయపడనున్నాయని గోయల్ అన్నారు. గ్లోబల్ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మార్గదర్శకులు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకుల అంతర్జాతీయ నెట్వర్క్ను రూపొందించాలని జీ-20 దేశాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్పలకు మద్దతు, స్ఫూర్తి ఇచ్చేలా, ఉత్తమ విధానాలు పరస్పరం పంచుకునేలా రెండు రోజుల సదస్సులో నిర్ణయాలు తీసుకోవాలని గోయల్ కోరారు. దేశంలో స్టార్టప్ సంస్కృతి మరింత పెంచేలా జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు. 2016లో ప్రారంభమైన స్టార్టప్ ఇండియా ప్రయాణంలో దేశంలోని యువత ఎన్నో విజయాలను సాధించారన్నారు. దీంతో గత ఏడు సంవత్సరాలలో కొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో సహాయపడిందని, వృద్థికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా స్టార్ట్పలు వృద్థి చెందడానికి మరియు అభివృద్థి చెందడానికి సహాయపడిందని ఆయన అన్నారు. ముఖ్యంగా కొవిడ్ లాంటి మహమ్మారిలోనూ ఆరోగ్య రంగంలో దేశంలో ఎన్నో ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయన్నారు.
స్టార్ట్పలకు రూ. 450 కోట్లు..
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను పుట్టిన, పార్లమెంటుకు ఎన్నికైన నగరంలో జీ-20 సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. స్టార్టప్ సదస్సు కోసం భారత్ను వేదికగా ఎంపిక చేయడం సరైనదని అన్నారు. కొత్త స్టార్టప్స్, యూనికార్న్లలో భారత్ మూడో స్థానంలో ఉందని, ఉద్యోగాలు సృష్టించే పరిస్థితిలో భారత యువత ఉందన్నారు. ఆవిష్కరణల్లో ముందంజలో ఉండటంతో పాటు పెట్టుబడులకు దేశం సరైన గమ్యస్థానంగా నిలుస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అన్ని రంగాల్లో వృద్ధి చెందుతోందన్నారు. స్టార్ట్పల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూ.450 కోట్లను కేటాయించిందని వివరించారు.
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 81వ ర్యాంక్లో ఉన్న భారత్.. 40 వ ర్యాంక్ను దక్కించుకోవటంలో ఆవిష్కరణలే కీలకంగా ఉన్నాయన్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యాటక రంగంలో ఉపయోగించాలని స్టార్ట్పలను కోరారు. 40 యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు దేశంలో ఉన్నాయని, వాటిని సందర్శించాలని కిషన్ రెడ్డి విదేశీ ప్రతినిధులను కోరారు.
జీ-20 సదస్సుతో కొత్త అధ్యాయం
హైదరాబాద్ సదస్సు దేశ స్టార్టప్ రంగంలో కొత్త అధ్యాయమని, ఈ సదస్సుతో దేశవ్యాప్తంగా స్టార్టప్ సంస్కృతి మరింత పెరుగుతుందని జీ-20 సదస్సుకు భారత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న అమితాబ్ కాంత్ తెలిపారు. జీ-20 సదస్సుల్లో భాగంగా ఇప్పటివరకు 56 నగరాల్లో 215 సమావేశాలు నిర్వహించామన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు జీ-20లో ఉన్నాయని, అందరి అనుభవాలు ప్రపంచానికి మేలు కలిగిస్తాయన్నారు. 21వ శతాబ్దంలో స్టార్ట్పలు ఎదుర్కోబోతున్న సవాళ్లను ఈ సదస్సులో చర్చిస్తామన్నారు.
రెండు రోజుల సన్నాహక సమావేశం అనంతరం కొనసాగింపుగా సిక్కిం, అండమాన్, బెంగళూరు, గురుగ్రామ్లోనూ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్, నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్, జీ-20 సదస్సు అధ్యక్షుడు చింతన్ వైష్ణవ్, డీపీఐఐటీ కార్యదర్శి అనురాగ్ జైన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, 29 దేశాల నుంచి ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్టార్ట్పలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు.