యూఏఈ ఆయిల్కు తొలిసారి రూపాయి మారకంలో చెల్లింపు
ABN , Publish Date - Dec 26 , 2023 | 03:29 AM
యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్కు రూపాయి మారకంలో భారత్ తొలి చెల్లింపు చేసింది. ప్రపంచంలో మూడో పెద్ద ఇంధన వినియోగ దేశం అయిన భారత్ ఇతర దేశాలతో కూడా ఇదే తరహా సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో స్థానిక కరెన్సీ చెల్లింపులకు ఇది శుభారంభం అవుతుంది.
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్కు రూపాయి మారకంలో భారత్ తొలి చెల్లింపు చేసింది. ప్రపంచంలో మూడో పెద్ద ఇంధన వినియోగ దేశం అయిన భారత్ ఇతర దేశాలతో కూడా ఇదే తరహా సౌకర్యం కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో స్థానిక కరెన్సీ చెల్లింపులకు ఇది శుభారంభం అవుతుంది. అయితే ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలోనే ముందుకు సాగుతుందని, ఇందుకోసం ఎలాంటి నిర్దిష్ట లక్ష్యాలు నిర్దేశించలేదని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ 85 శాతం ఆయిల్ అవసరాలకు దిగుమతుల పైనే ఆధారపడుతుంది. యూఏఈతో రూపాయి చెల్లింపులకు అవకాశం కల్పించే ఒప్పందంపై గత జూలైలో భారత్ సంతకం చేసింది. ఆ తర్వాత ఆగస్టులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ).. అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ (అద్నాక్) నుంచి కొనుగోలు చేసిన 10 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ కోసం రూపాయిల్లో చెల్లింపులు చేసింది. ఆ తర్వాత రష్యా నుంచి కొనుగోలు చేసిన కొంత మొత్తం క్రూడాయిల్కు కూడా రూపాయిల్లో చెల్లింపులు చేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఎన్నో దశాబ్దాలుగా ఆయిల్ దిగుమతులకు డీఫాల్ట్ కరెన్సీగా అమెరికన్ డాలర్ చలామణిలో ఉంది.