లగ్జరీ కార్లకు పండగ కళ
ABN , First Publish Date - 2023-11-20T01:56:56+05:30 IST
ప్రస్తుత పండగల సీజన్లో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మెర్సిడెస్, ఆడి కంపెనీలు రికార్డు అమ్మకాలు నమోదు చేశాయి...

న్యూఢిల్లీ: ప్రస్తుత పండగల సీజన్లో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. మెర్సిడెస్, ఆడి కంపెనీలు రికార్డు అమ్మకాలు నమోదు చేశాయి. దేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంటుందని ఆ కంపెనీలంటున్నాయి. ఏడాది పొడవునా జోరుగా అమ్మకాలు సాగిస్తున్న లగ్జరీ కార్ల పరిశ్రమ ఈ ఏడాది అత్యుత్తమ అమ్మకాల రికార్డును సాధించగలమన్న విశ్వాసం ప్రకటిస్తోంది. ఈ ఏడాది ఓనమ్ నుంచి దీపావళి మధ్య కాలంలో గడిచిపోయిన సంవత్సరాల కన్నా మెరుగైన అమ్మకాలు నమోదు చేశామని మెర్సిడెస్ బెంజ్ ఇండి యా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త మోడళ్లు ప్రవేశపెట్టడంతో పాటు కస్టమర్ల ఎంపికకు ఆకర్షణీయమైన కార్లు అందుబాటులో ఉండడం ఇందుకు కారణమన్నారు. కాగా ఈ ఏడాది జనవరి-సెప్టెంబరు మధ్య కాలంలో అమ్మకాల్లో 88 శాతం వృద్ధిని నమోదు చేశామని, 5,530 కార్లు విక్రయించామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ వెల్లడించారు. ఆర్డర్లు కూడా చాలాల బలం గా ఉన్నాయన్నారు. హైదరాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్లలో మంచి డిమాండ్ కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది లగ్జరీ కార్ల మార్కెట్ 2018లో నమోదైన 47,000అమ్మకాల మైలురాయిని దాటుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.