స్టాక్ బ్రోకర్ల మోసాలకు చెక్!
ABN , First Publish Date - 2023-01-18T00:27:07+05:30 IST
స్టాక్ బ్రోకర్లు మదుపరుల సొమ్మును దుర్వినియోగం చేయడం, డిఫాల్ట్ కావడం వంటి సంఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి...
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్లు మదుపరుల సొమ్మును దుర్వినియోగం చేయడం, డిఫాల్ట్ కావడం వంటి సంఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ మార్కెట్ తరహాలో సెకండరీ మార్కెట్లోనూ ఫండ్స్ బ్లాకింగ్ వసతిని ప్రవేశపెట్టాలని మంగళవారం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై వచ్చే నెల 16 కల్లా అభిప్రాయాలను తెలియజేయాలని సంబంధిత వర్గాలను సెబీ కోరింది. ప్రైమరీ మార్కెట్ ద్వారా పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీఓ) లేదా ఇతర పథకాల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ఫండ్స్ బ్లాక్ చేసుకునే వసతి ‘అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్’ (ఏఎ్సబీఏ) ఇప్పటికే అందుబాటులో ఉంది. తద్వారా మదుపరికి కేటాయింపులు జరిగాకే తన ఖాతా నుంచి సొమ్ము బదిలీ జరుగుతుంది. సెకండరీ మార్కెట్లోనూ ఈ వసతి అందుబాటులోకి వస్తే, ఇన్వెస్టర్లు ట్రేడింగ్ జరిపేందుకు సొమ్ము ను స్టాక్ బ్రోకర్ ఖాతాకు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. క్లియరింగ్ కార్పొరేషన్ (సీసీ) పేరిట సొమ్మును తన బ్యాంక్ ఖాతాలోనే బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుందని సెబీ పేర్కొంది.
మళ్లీ 18,000 పైకి నిఫ్టీ
మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీ్సతోపాటు హెచ్డీఎ్ఫసీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లలో కొనుగోళ్లు సెన్సెక్స్, నిఫ్టీని ముందుకు నడిపించాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 562.75 పాయింట్ల లాభంతో 60,655.72 వద్ద క్లోజైంది. నిఫ్టీ 158.45 పాయిం ట్లు లాభపడి 18,053 వద్ద స్థిరపడింది.