టెకీలకు ఉచితాల ఎర!
ABN , First Publish Date - 2023-06-11T01:39:37+05:30 IST
ఐటీ రంగ ఉద్యోగులకు చాలాకాలంగా ఇంటి నుంచే పనిచేయడం అలవాటైపోయింది. కరోనా సంక్షోభం ముగిసింది.. ఐటీ కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. కానీ, అలవాటైన ప్రాణం కదా.. ఆఫీసుకెళ్లి పనిచేసేందుకు చాలామంది టెకీలకు ఒళ్లు, మనసు రెండూ సహకరించడం లేదు. దాంతో వారిని...
కార్యాలయాలకు తిరిగి రప్పించేందుకు నానా తిప్పలు పడుతున్న ఐటీ కంపెనీలు
ఐటీ రంగ ఉద్యోగులకు చాలాకాలంగా ఇంటి నుంచే పనిచేయడం అలవాటైపోయింది. కరోనా సంక్షోభం ముగిసింది.. ఐటీ కంపెనీలు తమ సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయి. కానీ, అలవాటైన ప్రాణం కదా.. ఆఫీసుకెళ్లి పనిచేసేందుకు చాలామంది టెకీలకు ఒళ్లు, మనసు రెండూ సహకరించడం లేదు. దాంతో వారిని తిరిగి ఆఫీసుకు రప్పించేందుకు ఐటీ కంపెనీలిప్పుడు నానా తిప్పలు పడుతున్నాయి. వారికి ఉచితాలను ఎరవేస్తున్నాయి. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. ఆఫీసుకొచ్చి పనిచేసే సిబ్బందికి ఉచిత భోజనంతో పాటు ఇతర ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తోంది. వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలని, లేదంటే వార్షిక వేతన పెంపులో కోత పడవచ్చని పరోక్షంగా హెచ్చరిస్తూ సిబ్బందికి మెమో కూడా జారీ చేసింది. భారత ఐటీ కంపెనీలదీ ఇదే పరిస్థితి. దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్.. తన సిబ్బంది వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావడం తప్పనిసరి చేసింది. కీలక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత క్యాబ్ సౌకర్యం కూడా ఆఫర్ చేస్తోంది. అంతర్జాతీయ అకౌంటింగ్ సేవల సంస్థ డెలాయిట్ కూడా కార్యాలయానికి వచ్చి పనిచేసే సిబ్బందికి రవాణా ఖర్చులను పూర్తిగా రీయింబర్స్ చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, సిబ్బంది తమ వాహనాలను పార్క్ చేసేందుకు వెచ్చించే సొమ్మును కూడా చెల్లించేందుకు సిద్ధమైంది. డెలాయిట్ ఇండియా తన ఎగ్జిక్యూటివ్లకు నెలకు రూ.20,000 వరకు రవాణా ఖర్చులకు రీయింబర్స్మెంట్ ఆఫర్ చేస్తోంది. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా సిబ్బందిని తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు భిన్న వ్యూహాలు అనుసరిస్తున్నాయి. చిన్న నగరాల్లోనూ కార్యాలయాలు తెరిచి, స్థానిక ఉద్యోగులను హైదరాబాద్, బెంగళూరులోని ప్రధాన కార్యాలయాలకు బదులగా అక్కడికే వచ్చి పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఐటీ నిపుణులకు మరింత దగ్గరయ్యేందుకు హుబ్బలి, ఇండోర్, నాగ్పూర్, కోయంబత్తూర్ వంటి చిన్న నగరాల్లోనూ కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఇన్ఫోసిస్ 2022-23 నివేదికలో తెలిపింది.