భోగాపురం విమానాశ్రయానికి మరో రూ.675 కోట్లు
ABN , Publish Date - Dec 22 , 2023 | 04:38 AM
ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి నిర్వహించనున్న జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీవీఐఏఎల్)లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేసి నిర్వహించనున్న జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీవీఐఏఎల్)లో నేషనల్ ఇన్వె్స్టమెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) రూ.675 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్), ఎన్ఐఐఎఫ్ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2022, డిసెంబరులో జీఎంఆర్, ఎన్ఐఐఎ్ఫల మధ్య ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్కు చెందిన మూడు ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుల్లో ఎన్ఐఐఎఫ్ పెట్టుబడులు పెడుతుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా తాజాగా భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టులో ఎన్ఐఐఎఫ్ పెట్టుబడులు పెడుతోందని జీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటికే జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో ఎన్ఐఐఎఫ్ పెట్టుబడులు పెట్టింది.