ఇళ్ల అమ్మకాల్లో కొత్త రికార్డు
ABN , Publish Date - Dec 29 , 2023 | 04:54 AM
దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఇళ్ల ధరలు 15 శాతం మేరకు పెరిగినప్పటికీ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 31 శాతం పెరిగాయని...
2023లో 31 శాతం వృద్ధి
ధరల్లోనూ 10-24 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ఇళ్ల ధరలు 15 శాతం మేరకు పెరిగినప్పటికీ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 31 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వార్షిక నివేదికలో తెలిపింది. ఏడాది మొత్తం మీద ఈ ఏడు నగరాల్లో 4,,76,530 లక్షల ఇళ్లు అమ్ముడుపోయాయి. ఇది కూడా చారిత్రక రికార్డు స్థాయి. గత ఏడాది అమ్మకాలు 3,64,870. ప్రపంచ ప్రతికూలతలు, పెరిగిన ప్రాపర్టీ ధరలు, అధిక వడ్డీరేట్లు వంటి ప్రతికూలతల సమయంలో కూడా 2023 గృహనిర్మాణ రంగానికి అత్యంత సానుకూల సంవత్సరమని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి అన్నా రు. ఇళ్లకు ప్రస్తుత డిమాండుకు దీటుగానే దేశంలో కొత్త ప్రాజెక్టులు కూడా జోరుగా ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో అత్యధికంగా 1,53,870 ఇళ్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది అమ్మకాలు 1,09,730తో పోల్చితే 40 శాతం పెరిగాయి. ఇది కాకుండా ఇళ్ల అమ్మకాలు పూణేలో 52 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్లో 3 శాతం, బెంగళూరులో 29 శాతం, కోల్కతాలో 9 శాతం, చెన్నైలో 9 శాతం పెరిగాయి.
హైదరాబాద్లో 30 శాతం వృద్ధి: ఇళ్ల అమ్మకాలు హైదరాబాద్లో 30 శాతం పెరిగాయి. ఈ ఏడాది మొత్తంలో 61,715 ఇళ్లు అమ్ముడు పోయాయి. గత ఏడాది అమ్మకాలు 47,485 యూనిట్లు. కాగా ఇళ్ల ధరలు హైదరాబాద్లో అత్యధికంగా 24 శాతం పెరిగాయి. గత ఏడాది చదరపు అడుగు ధర రూ.4620 ఉండగా ఈ ఏడాది రూ.5750 పలికింది. మొత్తం ఏడు నగరాల్లోనూ కలిపి ఇళ్ల ధరలు సగటున 10-24 శాతం పెరిగాయి.