2030 నాటికి రూ.82 లక్షల కోట్లు
ABN , First Publish Date - 2023-06-07T02:56:33+05:30 IST
భారత్లో ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి 6 రెట్ల వృద్ధితో లక్ష కోట్ల డాలర్లకు (రూ.82 లక్షల కోట్ల పైమాటే) చేరుకోవచ్చని గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది...
ఏడేళ్లలో ఆరింతలు కానున్న భారత ఇంటర్నెట్ ఎకానమీ
గూగుల్, టెమాసెక్, బెయిన్ సంయుక్త నివేదిక అంచనా
న్యూఢిల్లీ: భారత్లో ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2030 నాటికి 6 రెట్ల వృద్ధితో లక్ష కోట్ల డాలర్లకు (రూ.82 లక్షల కోట్ల పైమాటే) చేరుకోవచ్చని గూగుల్, టెమాసెక్, బెయిన్ అండ్ కంపెనీ సంయుక్త నివేదిక అంచనా వేసింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసెస్ (ఎస్ఏఏఎస్), ఆన్లైన్ మీడియా విభాగాలు ఇందుకు ప్రధానంగా దోహదపడ నున్నాయని రిపోర్టు పేర్కొంది. 2022లో భారత ఇంటర్నెట్ ఎకానమీ 15,500-17,500 కోట్ల డాలర్ల స్థాయిలో ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. భవిష్యత్లో చాలావరకు కొనుగోళ్లు డిజిటల్ మాధ్యమం ద్వారానే జరగనున్నాయని గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా అన్నారు. డిజిటల్ ఆవిష్కరణల విషయంలో స్టార్టప్లు ముందున్నాయని, కరోనా సంక్షోభం తర్వాత బడా కార్పొరేట్ కంపెనీలు, ఎస్ఎంఈలు తమ పోటీ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డిజిటల్ టెక్నాలజీలను విరివిగా వినియోగించుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో బిజినెస్ టు కస్టమర్ (బీ2సీ) విభాగ ఈ-కామర్స్ వ్యాపారం 2030 నాటికి 5-6 రెట్ల వృద్ధితో 35,000-38,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోచవ్చని.. 2022లో ఈ వ్యాపారం సైజు 6,000-6,500 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని రిపోర్టు అంచనా వేసింది.
కాగా, గత ఏడాది నాటికి 800-900 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) విభాగ ఈ-కామర్స్ వ్యాపారం 2030 నాటికి ఏకంగా 13-14 రెట్లు పెరిగి 10,500-12,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని నివేదిక భావిస్తోంది. అలాగే, 2022లో 1,200-1,300 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న ఎస్ఏఏఎస్ సేవల మార్కెట్ సైజు 2030 నాటికి 5-6 రెట్ల వృద్ధితో 6,500-7,500 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి ప్రధాన చోదకాల్లో భారత్ ఒకటి కానుందని టెమాసెక్ పెట్టుబడుల విభాగ ఎండీ విశేష్ శ్రీవాస్తవ్ పేర్కొన్నారు.