Share News

పదేళ్లలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2023-12-11T04:26:23+05:30 IST

అదానీ గ్రూప్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే పదేళ్ల కాలం లో రూ.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ...

పదేళ్లలో 7 లక్షల కోట్ల పెట్టుబడులు

‘ఎక్స్‌’లో గౌతమ్‌ అదానీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే పదేళ్ల కాలం లో రూ.7 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ, సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌ ‘ఎక్స్‌’ ద్వారా దీనికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా మౌలిక రంగం లో తమ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటామని తెలిపారు. అదానీ గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఇప్పటికే గనులు, విమానాశ్రయాలు, రక్షణ, వైమానిక, సౌర విద్యుత్‌, రోడ్లు, మెట్రో, డేటా కేంద్రాలు, వనరుల నిర్వహణ వంటి కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించింది.

1,000 మెగావాట్ల ప్లాంట్‌: 2040 నాటికి అదానీ పోర్ట్స్‌ కాలుష్య ఇంధన వినియోగానికి పూర్తిగా స్వస్తి చెప్పనున్నట్టు గౌతం అదానీ ప్రకటించారు. పూర్తిగా అదానీ పోర్ట్స్‌ అవసరాల కోసం 1,000 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న పునరుత్పాదక ఇంధన ప్లాంట్‌ ఏర్పా టు చేయబోతున్నట్టు తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తీర ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి 5,000 హెక్టార్లలో మడ అడవులు పెంచనున్నట్టు అదానీ వెల్లడించారు. దీనికి తోడు గుజరాత్‌లోని కచ్‌ ఎడారి ప్రాంతంలో 726 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 30,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధ న వనరుల పార్క్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు అదానీ ప్రకటించారు ప్రపంచంలో మరెక్కడా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం ఇంత పెద్ద పార్కు ఏర్పాటు చేయడంలేదన్నారు ఆకాశం నుంచి చూసినా కనిపించే ఈ ప్రాజెక్టు ద్వారా రెండు కోట్లకుపైగా గృహాలకు విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు.

ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు :

విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నట్టు గౌతం అదానీ తెలిపారు. ఇందుకోసం అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీ ద్వారా 2030 నాటికి దేశ వ్యాప్తంగా 75,000 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి తోడు ఇదే కంపెనీ ద్వారా వ్యవసాయ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చే ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.

Updated Date - 2023-12-11T04:26:25+05:30 IST