అరచేతిలో 6 రకాల పరీక్షలు
ABN , First Publish Date - 2023-04-19T03:40:40+05:30 IST
రక్తం తీసుకోకుండా రక్తం లో గ్లూకోజ్ పరిమాణం తెలుసుకోవడం కేవలం తాము అభివృద్ధి చేసిన ఈవా గాడ్జెట్తోనే సాధ్యమని బ్లూసెమీ ఫౌండర్ సీఈఓ సునీల్ మద్దికట్ల అన్నారు. మంగళవారం టీహబ్లో...

అందుబాటులోకి తెచ్చిన బ్లూసెమీ
ఈవా పేరుతో హెల్త్ గాడ్జెట్ రూపకల్పన
కృత్రిమ మేధతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి గుర్తింపు
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): రక్తం తీసుకోకుండా రక్తం లో గ్లూకోజ్ పరిమాణం తెలుసుకోవడం కేవలం తాము అభివృద్ధి చేసిన ఈవా గాడ్జెట్తోనే సాధ్యమని బ్లూసెమీ ఫౌండర్ సీఈఓ సునీల్ మద్దికట్ల అన్నారు. మంగళవారం టీహబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బ్లూసెమీ రూపొందించిన లైఫ్స్టైల్ గాడ్జెట్ ‘ఈవా’ వివరాలను ఆయన వెల్లడించారు. ‘ఈవా’ పరికరంపై రెండు బొటనవేళ్లను ఉంచటం ద్వారా కేవలం 60 సెకన్లలోనే రక్తంలోని సగటు గ్లూకోజ్ (హెచ్బీఏ1సీ), హార్ట్రేట్, బీపీ, ఈసీజీ, ఆక్సిజన్ స్థాయిలను మొబైల్ యాప్లో చూడవచ్చన్నారు. నాన్ ఇన్వాసివ్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), సెన్సార్ వినియోగంతో ఈవాను రూపొందించామన్నారు. గాడ్జెట్ సహా యాప్లో రక్తపోటు, హృదయ స్పందనలు మానిటర్ చేయడంతో పాటు ఈ సమాచారాన్ని క్రోడీకరించి హెల్త్ టిప్స్ను అందిస్తామన్నారు. జీవనశైలిలో మార్పుల కారణంగా హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, నిరాశ, ఆందోళనలు వస్తున్నాయని, ఈవా గాడ్జెట్ ద్వారా ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారాన్ని గమనిస్తూ రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించవచ్చన్నారు.
ఈవా యాప్లో పొందుపరిచిన వివరాలను గోప్యంగా ఉంచుతామని, ఏఐ బేస్డ్ టెక్నాలజీ ద్వారా ఆరోగ్యానికి సంబంధించి సలహాలు సూచనలు అందిస్తామన్నారు. మార్చిలో ప్రారంభించిన ఫ్లాష్ సేల్లో గంటల వ్యవధిలో 2 వేల ఈవా గాడ్జెట్స్ను విక్రయించామన్నారు. కాగా ఈ నెలాఖరులో మరో ఫ్లాష్ సేల్ను ప్రారంభిస్తున్నామని సునీల్ తెలిపారు.