సీబీఐ ‘సుప్రీం’ను ఆశ్రయించాల్సిందే
ABN , First Publish Date - 2023-06-01T05:14:19+05:30 IST
‘‘ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నామ మాత్రపు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంపై సీబీఐ తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. సీబీఐ పైనే హైకోర్టు అభియోగాలను మోపింది. ఇప్పుడు సీబీఐకి ఇష్టం ఉన్నా లేకపోయినా సుప్రీం
● సీబీఐపైనే హై కోర్టు అభియోగం మోపింది
● ఆ తీర్పుపై డాక్టర్ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయాలి
● న్యాయమూర్తులను తిట్టిన కేసులో జగన్మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలి: రఘురామరాజు
న్యూఢిల్లీ, మే 31(ఆంధ్రజ్యోతి): ‘‘ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టు నామ మాత్రపు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంపై సీబీఐ తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. సీబీఐ పైనే హైకోర్టు అభియోగాలను మోపింది. ఇప్పుడు సీబీఐకి ఇష్టం ఉన్నా లేకపోయినా సుప్రీం కోర్టులో అప్పీల్ చేయడం మినహా మరొక మార్గం లేదు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తన తండ్రి చావుకు కారణమైన సూత్రధారులెవరో తెలుసుకోవాలని పోరాడుతున్న డాక్టర్ వైఎస్ సునీత, సుప్రీం కోర్టును ఆశ్రయించాలి. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబా? కాదా? అన్నది తేల్చాల్సింది సుప్రీంకోర్టు. అవినాశ్రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, అరెస్టు చేయాలనుకుంటే వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పేర్కొంది. ఈ తీర్పును నేను ఊహించలేదు. బెయిల్ ఇవ్వాలనుకుంటే న్యాయమూర్తి ఇవ్వవచ్చు. ఆయన విచక్షణా అధికారాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ అర్హత లేదు. జూన్ 30లోగా వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, వైఎస్ అవినాశ్రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించడం కీలకం. ఇదే విషయాన్ని సీబీఐ, సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలి. అప్పుడు విచారణను మరొక నెల పొడిగించే అవకాశాలు ఉంటాయేమో?’’ అని రఘురామరాజు అన్నారు. న్యాయమూర్తులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం కోర్టు ధిక్కరణే అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో జగన్మోహన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన గురించి అమెరికన్ సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ మాట్లాడడం అభినందనీయమన్నారు. అమెరికా సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్ను రద్దు చేయాలని అధ్యక్షుడు జో బైడెన్కు, అసెంబ్లీ స్పీకర్ లేఖ రాస్తారా..! అంటూ రఘురామరాజు ఎద్దేవా చేశారు.