కొత్త వేతన సవరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం
ABN , First Publish Date - 2023-06-02T04:21:21+05:30 IST
ఇంధన సంస్థలలో ప్రతిపాదిస్తోన్న కొత్త వేతన సవరణ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ సంస్థల ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ
● విద్యుత్ సంస్థల ఉద్యోగుల జేఏసీ స్పష్టీకరణ
అమరాతి, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ఇంధన సంస్థలలో ప్రతిపాదిస్తోన్న కొత్త వేతన సవరణ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని విద్యుత్ సంస్థల ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ అమలులో ఉన్న వేతన సవరణనే కొనసాగించాలని తేల్చిచెప్పింది. ఉద్యోగ సంఘాల ముందు ఇంధన సంస్థల యాజమాన్యం ఉంచిన ప్రతిపాదనలను తిరస్కరించింది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జెన్కో ఎండీ చక్రధర్బాబుతో గురువారం విజయవాడలో వేతన సవరణ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పి.చంద్రశేఖర్, సెక్రటరీ జనరల్ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణతోపాటు 29 సంఘాల ఉద్యోగ నేతలు సమావేశమయ్యారు. వేతన సవరణ సింగిల్ మాస్టర్ స్కేల్గా అమలు చేస్తామని విజయానంద్ వెల్లడించారు. గరిష్ఠ మాస్టర్ పేస్కేల్ దాటినవారికి మూలవేతన స్పెషల్ పేగా .. గరిష్ఠ కేడర్ స్కేలు దాటిన వారికి పర్సనల్ పేగా చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. పేస్కేల్లో పర్సంటేజీ వారీగా ఇస్తామని చెప్పారు. ఈ విధానం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. విద్యుత్ సంస్థల యాజమాన్యాల ప్రతిపాదనలను తిరస్కరించాయి. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని విజయానంద్ హామీ ఇచ్చారు.