CM JAGAN: అప్పులపాలయ్యాం.. ఆదుకోండి

ABN , First Publish Date - 2023-03-31T03:39:31+05:30 IST

రుణభారంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్మోహన్‌ రెడ్డి అభ్యర్థించారు.

CM JAGAN: అప్పులపాలయ్యాం..  ఆదుకోండి

లేకపోతే మరిన్ని సమస్యలు

పోలవరానికి 10వేల కోట్లు ఇవ్వండి

నిర్మలా సీతారామన్‌కు జగన్‌ అభ్యర్థన

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రుణభారంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్మోహన్‌ రెడ్డి అభ్యర్థించారు. రాష్ట్రానికి సాయం చేయకపోతే మరింత ఇబ్బందులపాలవుతామని ఆయన చెప్పినట్లు తెలిసింది. రుణాలకు అనుమతించడంతోపాటు పెండింగ్‌ బకాయిలు, ఆయా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రితో జగన్‌ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అడ్‌హాక్‌గా రూ. 10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. డయాఫ్రంవాల్‌ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నందున త్వరితంగా ఈ నిధులు మంజూరు చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. రూ.2600.74 కోట్లను త్వరగా రీయింబర్స్‌ చేయాలని, పోలవరం అంచనా వ్యయాలను రూ. 55,548 కోట్లుగా ఆమోదించాలని అభ్యర్థించారు.

అలాగే, ఉపాధి హామీ పథకం బకాయిలు రూ. 2500 కోట్లు విడుదల చేయాలన్నారు. 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కేంద్రం కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిస్కమ్‌ సంస్థల నుంచి రావాల్సిన రూ.7,058 కోట్లు ఇప్పించాలని అభ్యర్థించారు. అలాగే, 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు నిధులు రూ. 36,625 కోట్లు విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాను ఏపీకి కల్పించాలన్నారు. ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అనంతరం ఆయన ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చేశారు.

Updated Date - 2023-03-31T03:39:31+05:30 IST