రైతుల్ని ఆదుకునే దాకా సర్కార్‌ను వదిలేది లేదు

ABN , First Publish Date - 2023-06-07T03:09:07+05:30 IST

అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని టీడీపీ అగ్రికల్చర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హెచ్చరించారు.

రైతుల్ని ఆదుకునే దాకా సర్కార్‌ను వదిలేది లేదు

టీడీపీ అగ్రికల్చర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుల హెచ్చరిక

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని టీడీపీ అగ్రికల్చర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు హెచ్చరించారు. జగన్‌రెడ్డి ముక్కు పిండి రైతులకు రావాల్సిన సొమ్ము ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ‘పంట మునిగింది..పరిహారం ఇవ్వండి’ అని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో అగ్రికల్చర్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కూన రవికుమార్‌ మీడియాతో మాట్లాడారు. ‘అకాల వర్షాలకంటే జగన్‌ నిర్లక్ష్య ధోరణి, చేతకానితనమే ఉభయ గోదావరి జిల్లాల అన్నదాతలతోపాటు రాష్ట్రంలోని రైతుల్ని ముంచేసింది. రైతు సంఘాలను కలిసి, క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతులకు జరిగిన నష్టం అంచనా వివరాల్ని సేకరించి ప్రభుత్వం ముందుంచుతాం. రైతులకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తుంది.’ అని నేతలు చెప్పారు.

Updated Date - 2023-06-07T03:09:07+05:30 IST