అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలి

ABN , First Publish Date - 2023-04-26T04:27:16+05:30 IST

సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

అవినీతి, అక్రమాలు, అఘాయిత్యాలకు   వ్యతిరేకంగా పోరాడాలి

విలువలతో కూడిన విద్యకు పెద్దపీట వేయాలి

‘అక్షర’ వార్షికోత్సవంలో వెంకయ్యనాయుడు

వెంకటాచలం, ఏప్రిల్‌ 25: సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, అరాచకాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతినగర్‌ వద్ద ఉన్న అక్షర విద్యాలయం 12వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి వెంకయ్య ఈ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. విలువలతో కూడిన విద్యకు పెద్ద పీట వేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పాఠశాలలు పని చేయాలని పిలుపునిచ్చారు. మన దేశ భవిష్యత్‌ యువత భుజస్కంధాలపైనే ఉందన్నారు. పర్యావరణాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలన్నారు.

మాతృభాషను కాపాడుకుని, పిల్లలని అమ్మభాష వైపు ప్రేరేపించాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో ఏర్పాటైన అక్షర, ఆ స్ఫూర్తి కాపాడుకోవటం అభినందనీయమన్నారు.పేదలకు సేవా చేయాలన్న తత్వం ప్రతి ఒక్కరిలో కలగాలని, దాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని, ప్రజల కోసం జీవిస్తే మనల్ని పదికాలాలపాటు గుర్తుంచుకుంటారన్నారు. ప్రముఖ గాయకుడు ఆర్పీ శ్రావణ్‌, వెంకయ్య సతీమణి ఉషమ్మ, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-26T04:27:16+05:30 IST