నోటీసులకు భయపడేది లేదు
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:57 AM
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.
సమగ్ర శిక్ష ఉద్యోగులు
పార్వతీపురం, ఏలూరు కలెక్టరేట్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే..షోకాజ్ నోటీసులు ఇవ్వడమేమిటని సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎ్సఏ) ఉద్యోగులు ప్రశ్నించారు. ఈ మేరకు పార్వతిపురం మన్యం జిల్లా పార్వతీపురంలోని డీఈవో కార్యాలయం ఎదుట బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నోటీసులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ సమస్యలపై సర్కారు స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని జిల్లా ఎస్ఎ్సఏ జేఏసీ అధ్యక్షుడు పోలినాయుడు స్పష్టం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగల నిరసనకు యూటీఎఫ్ నేతలు మద్దతు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మెలో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏలూరు జిల్లాలో 8వ రోజు బుధవారం నిరసన కొనసాగించారు. ఏలూరులోని కలెక్టరేట్ నుంచి డీఈవో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. సమగ్రశిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు.