అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:06 AM
రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్లో పని చేస్తున్న సిబ్బంది, అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
నంద్యాల (నూనెపల్లె), డిసెంబరు 21: రాష్ట్రంలో సమగ్ర శిక్షా అభియాన్లో పని చేస్తున్న సిబ్బంది, అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం నంద్యాలలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమగ్ర శిక్షా అభియాన్లో పని చేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని, అరకొరగా జీతాలు చెల్లిస్తున్నా ఆ జీతాలు కూడా రాని కారణంగా ఏవిధంగా వారు జీవనాన్ని సాగిస్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు, పుల్లయ్య, మునిస్వామి, పవన్కుమార్, రవి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.