TDR Bonds : బ్యాండ్ వేసేశారు!
ABN , First Publish Date - 2023-12-10T03:21:47+05:30 IST
జగన్ ప్రభుత్వంలో పూటకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ప్రజలకు పెద్దగా అర్థం కాని, కనపడని టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవల్పమెంట్ రైట్స్) బాండ్ల పేరిట రాష్ట్రమంతా రూ. కోట్లు కొట్టేసినట్టు తాజాగా బయటపడింది. డంపింగ్ యార్డును తొమ్మిది ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్నామంటూ పశ్చిమ
టీడీఆర్ బాండ్ల పేరిట రూ.కోట్లు కొట్టేశారు
రోడ్ల విస్తరణ పేరిట భారీఎత్తున దోపిడీ
పట్టణ మాస్టర్ప్లాన్ మాటున పక్కాగా మస్కా
భూసేకరణ జరగకుండానే బాండ్లు జారీ
ఓనరు నుంచి జీపీఏ తీసుకుని భూసేకరణ కింద
రూ.కోట్ల టీడీఆర్ బాండ్లు పొందిన వైసీపీ నేతలు
దొంగనోట్ల తరహాలో రాష్ట్రమంతా చలామణి
తణుకులో రూ.900 కోట్ల అక్రమాలు
గుంటూరులో మరో 300 కోట్లు నొక్కేశారు
రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది. అచ్చం జగన్ పాలనలాగే ఉంది. ఎక్కడ గుంతో, ఎక్కడ రోడ్డో చెప్పలేని పరిస్థితి! కానీ, రోడ్ల విస్తరణ ప్రణాళికల పేరిట రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. టీడీఆర్ బాండ్లు పేరిట రాష్ట్రానికి రూ. వేల కోట్లలో బ్యాండ్ వేసేస్తున్నారు. నిన్న తిరుపతిలో టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి లాగిన తీగ....ఇప్పుడు తణుకు, గుంటూరు సహా రాష్ట్రమంతా డొంకను కదిలిస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో టీడీఆర్ వ్యవహారం అధికార పార్టీ పెద్దలను కలవరపాటుకు గురిచేస్తోంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ ప్రభుత్వంలో పూటకో కుంభకోణం వెలుగులోకి వస్తోంది. ప్రజలకు పెద్దగా అర్థం కాని, కనపడని టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవల్పమెంట్ రైట్స్) బాండ్ల పేరిట రాష్ట్రమంతా రూ. కోట్లు కొట్టేసినట్టు తాజాగా బయటపడింది. డంపింగ్ యార్డును తొమ్మిది ఎకరాల్లో ఏర్పాటుచేస్తున్నామంటూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో భూసేకరణ పేరిట జారీచేసిన టీడీఆర్ బాండ్లలో వైసీపీ నాయకులు రూ.900 కోట్లకుపైగా నొక్కేసినట్టు తెలిసింది. తిరుపతిలో రూ.450 కోట్ల టీడీఆర్ స్కామ్ జరిగిందని శుక్రవారం టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నెల్లూరులో ప్రెస్మీట్ పెట్టి వెల్లడించారు. ఒక్క తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో పలు పట్టణాలు, నగరాల్లో ఈ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా టీడీఆర్ బాండ్ల జారీలో వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. తణుకులో చదరపు గజం రూ.6,000 విలువ చేసే స్థలానికి రూ.లక్ష విలువ చేసే బాండ్లు విడుదల చేసి మున్సిపల్శాఖకు భారీ నష్టాన్ని కలిగించారన్న ఆరోపణలున్నాయి. భూయజమానులతో సంబంధం లేకుండా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) ఆధారంగా వేరేవాళ్లకు టీడీఆర్ బాండ్లు జారీచేయడం, మార్కెట్ రేట్ భారీగా పెంచడం, రెండు రెట్లు ఇవ్వాల్సిన భూములకు సైతం పరిహారం కింద 4రెట్లు విలువ కలిగిన బాండ్లను పందేరం చేయడం ద్వారా భారీ సంఖ్యలో వైసీపీ నేతలు లాభపడినట్లు ఆరోపిస్తున్నారు. ఒక్క తణుకు బాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఏడాది కిందట దీనిపై వచ్చిన ఆరోపణలు నేపధ్యంలో ముగ్గురు మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు.
బాండ్ల జారీలో అక్రమాలు...
తణుకు పట్టణంలో మొత్తం తొమ్మిది ఎకరాలతో డంప్యార్డ్ విస్తరణ కోసం స్థల సేకరణ చేపట్టారు. ఇక్కడ ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఉంది. టీడీఆర్ నిబంధనల ప్రకారం.. సుమారు రూ. 120 కోట్ల విలువైన బాండ్లు చేయాలి. కానీ, ఏకంగా సుమారు రూ.450 కోట్లకు టీడీఆర్ బాండ్లు జారీచేశారు. అంటే ఒక్కో ఎకరం ధర రూ.50 కోట్లు అన్నమాట! పొలాలను స్థలాలుగా పేర్కొంటూ ధరలను పెంచి చూపించేందుకు తణుకు పట్టణంలోని ఓ వ్యాపార సముదాయం రోడ్డు సర్వే నంబర్ చూపించారు. అదే విధంగా ఈ పట్టణంలో పార్క్ ఏర్పాటు చేసేందుకు మరో 9 ఎకరాలు సేకరించారు. దాని రేట్ కూడా ఆ ప్రాంతంలో దాదాపుగా అంతే ఉంది. అయితే ఈ భూమికి కూడా గ్రీన్ ఫీల్డ్ కింద రిజర్వ్ చేసిన స్థలం సర్వే నెంబర్ రేట్లను నిర్ణయించారు. ఎకరా రూ.50 కోట్ల చొప్పున రూ.450 కోట్లతో బాండ్లను మంజూరుచేశారు. ఇవి కాకుండా జగనన్న కాలనీ లేఅవుట్లలో అదనంగా రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు మరో అర్ధ ఎకరం ఇదే ధరకు సేకరించినట్లు తెలుస్తోంది. ఆంరఽధప్రదేశ్లో ప్రధాన నగరాల్లో కూడా లేని రేట్లను తణుకు పట్టణంలో నిర్ణయించారు. మొత్తం ఒక్క తణుకులో రూ.900 కోట్ల టీడీఆర్ బాండ్లను జారీచేశారు. తణుకులో డంపింగ్యార్డ్ కోసం సేకరించిన భూమి యాజమానుల నుంచి కాకుండా థర్డ్ పార్టీ నుంచి సేకరించి అక్రమాలకు తెరదీశారు. కొంతమంది వైసీపీ నేతలు ఆయా భూ యజమానుల వద్ద నుంచి కొద్ది రోజుల ముందుగా పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చి టీడీఆర్ బాండ్లు పొందారు. భూయజమానులకు సంబంధం లేకుండా కేవలం పవర్ ఆఫ్ అటార్నీతో థర్డ్ పార్టీకి సంబంధించిన వారి నుంచి భూమిని సేకరించడం, దానికి బాండ్లు జారీచేయడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. పట్టణాభివృద్ధి అథారిటీ జారీ చేయాల్సిన బాండ్లను మున్సిపల్ కమిషనర్ జారీచేయడం కూడా నిబంధనలకు తిలోదకాలివ్వడమేనని చెప్తున్నారు. భూ యజమానుల నుంచి భూమిని సేకరించకుండా ఇతరుల నుంచి సేకరించడంతో ఆ భూసేకరణ జరిగినట్లు కాదని నిబంధనలు కచ్చితంగా చెప్తున్నాయి. దీంతో అసలు భూసేకరణ జరగకుండా రూ.వందల కోట్ల టీడీఆర్ బాండ్లు చలామణిలోకి వచ్చాయి. వైసీపీ నేతలు టీడీఆర్ బాండ్ల పేరిట మున్సిపల్శాఖను అడ్డగోలు ముంచేశారని ఆరోపిస్తున్నారు. దొంగ నోట్లను చలామణి చేసినట్లు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా టీడీఆర్ బాండ్లను జారీచేసి సొమ్ము చేసుకున్నారని విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విస్తరణ పేరిట, జగనన్న కాలనీ స్థలాల పేరిట టీడీఆర్ బాండ్లలో భారీ అవినీతి చోటు చేసుకుందని పేర్కొంటున్నారు.
ఏమిటీ టీడీఆర్..?
రాష్ట్రంలో పట్టణాలు, నగరాల విస్తరణలో భాగంగా కొత్త నిర్మాణాల కోసం స్థల సేకరణ చేపట్టే విషయంలో ఆర్థికంగా వెసులుబాటు కోసం మున్సిపల్శాఖ టీడీఆర్ బాండ్లను జారీ చేస్తుంది. రోడ్ల విస్తరణలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు సేకరించాలంటే పరిహారంగా ఈ బాండ్లు జారీచేస్తారు. రోడ్ల విస్తరణ కోసం అయితే ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ రేటుకు నాలుగింతల రేటుతో బాండ్లను జారీచేస్తారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థల సేకరణకు రెండు రెట్లు రేట్లతో పరిహారంగా బాండ్లు మంజూరుచేస్తారు. ఈ బాండ్లను రాష్ట్రంలో ఏ నగరంలోనైనా అదనంగా నిర్మించుకునే భవనాల నిర్మాణాల లైసెన్స్ ఫీజులు, బెటర్మెంట్ చార్జీలు, అదనపు బెటర్మెంట్ చార్జీలు, 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు తదితర ఫీజులకు బదులుగా ఈ బాండ్లను వినియోగించుకోవచ్చు. విస్తరణలో స్థలాలు కోల్పోయిన యజమానులు వాటిని రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కొత్తగా భవనాలు నిర్మించుకునే భూయజమానులకు విక్రయించే అవకాశం ఉంది. భారీ విలువ కలిగిన ఈ బాండ్లను 30 శాతానికి, 50 శాతానికి....ఇలా డిమాండ్ను బట్టి విక్రయించుకునే పరిస్థితులున్నాయి. దీంతో మున్సిపల్, పట్టణాభివృద్ధి సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకుండా నిర్మాణదారులు తక్కువ రేట్తో బాండ్లను కొనుగోలు చేసుకుని వినియోగించుకుంటున్నారు.
గుంటూరులో తణుకు బాండ్ల చలామణి..
తణుకు టీడీఆర్ బాండ్లు గుంటూరులో చలామణి అవుతున్నాయి. గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి తణుకు బాండ్ల వ్యవహారంలో చక్రం తిప్పారు. దీంతో ఒకే భవనానికి రూ.2 కోట్లకు పైగా తణుకు బాండ్లను పెట్టి అనుమతులు పొందినట్లు, మరొక భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా పొందినట్లు సమాచారం.
వాణిజ్య భవనం డోర్ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్లు
గుంటూరు(కార్పొరేషన్), డిసెంబరు 9: గుంటూరులో రోడ్డు విస్తరణ కింద చేపట్టిన పనుల్లో భారీ అవినీతి చోటుచేసుకుంది. గుంటూరు పెదకాకాని రోడ్డులో పందుల కాలనీ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెదకాకాని రోడ్డు నుంచి జాతీయ రహదారి వరకు వయా పందుల కాలనీ మీదగా 2.5కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించాలని ప్రతిపాదించింది. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారులు, వైసీపీ ముఖ్య నేతలు కుమ్మక్కయ్యారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు 30 అడుగులకు అదనంగా రోడ్డుకు ఇరువైపులా 15 అడుగుల చొప్పున సేకరిస్తున్నట్లుగా నోటీసులు జారీ చేశారు. నోటీసులను అందుకున్న వారితో గుంటూరు నగరపాలక సంస్థకు ఆ స్థలాన్ని, రోడ్డు కింద పోయేంతవరకు భవనాన్ని గిఫ్ట్ డీడ్ కింద ఇస్తున్నట్టు...గుంటూరు రిజిరేస్టషన్ కార్యాలయంలో తతంగం పూర్తి చేశారు. అయితే రోడ్డు ప్రారంభంలో బెస్ట్ ప్రైస్ కంపెనీ ఉంది. ఇక్కడ గజం ధర రూ.25 వేలు ఉండగా, హైవే దగ్గరికి వెళ్లేటప్పుడు మార్కెట్ విలువ తగ్గుతూ ఉంటుంది. అయితే రోడ్డు విస్తరణ కింద స్థలాలు, పొలాలు ఇచ్చిన రైతులకు వాణిజ్య భవనం కింద డోర్ నెంబర్ చూపించి గజం రూ9,500 ఉండగా రూ.25 వేల వరకు పెంచి భారీ స్కామ్కు ప్రయత్నించారు. గజానికి సుమారు రూ.60వేలకు పైగా అక్రమానికి పాల్పడ్డారు. ఆ రోడ్డు మొత్తం మీద సుమారు 200 మంది బాధితులు ఉండగా వారందరి వద్ద ఈ విధంగా పెంచి పెద్ద ఎత్తున దోపిడికి ప్రయత్నించారు. ఈ రోడ్డు విస్తరణలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో రూ.300 కోట్ల దోపిడీ చేయాలని వైసీపీ నేతలు ప్రణాళికతో రంగంలోకి దిగారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన తక్కెళ్లపాడు, ఉప్పలపాడు గ్రామాల రైతులు నేరుగా గుంటూరు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్రమాల వ్యవహారం బహిర్గతమైంది.