Tdp Leader : టీడీపీ నేత కాళ్లు నరికారు

ABN , First Publish Date - 2023-08-30T02:45:14+05:30 IST

పల్నాడులో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో మంగళవారం వైసీపీనేతలు గొడ్డళ్లతో దాడి చేసి టీడీపీ నేత కాళ్లు నరికివేశారు.

Tdp Leader : టీడీపీ నేత కాళ్లు నరికారు

వైసీపీ నేతల బరితెగింపు

గ్రామ దేవతకు మొక్కులపై ఘర్షణ

రెచ్చిపోయి టీడీపీ వారిపై వైసీపీ దాడులు

చేతికి దొరికిన ఒకరి కాలిపై గొడ్డలివేటు

అడ్డుకోబోయిన మరొకరికీ గాయాలు

టీడీపీ నేతల ఇళ్లపై పడి బీభత్సకాండ

మాచర్ల, ఆగస్టు 29: పల్నాడులో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో మంగళవారం వైసీపీనేతలు గొడ్డళ్లతో దాడి చేసి టీడీపీ నేత కాళ్లు నరికివేశారు. గ్రామ దేవతకు మొక్కులు చెల్లించుకునే క్రమంలో జరిగిన ఘర్షణ రాళ్ల దాడికి దారితీసింది. వైసీపీ నేతల దాడికి ప్రతిఘటించి టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.. ఈ దాడుల్లో టీడీపీ నేత రాజబోయిన బాబు కాళ్లు నరికి వేయగా, అడ్డుపడిన నక్కా శివరాజు మెడపై గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళితే.. గొట్టిపాళ్ల గ్రామంలో సత్తెమ్మతల్లికి గ్రామస్థులు కుంకుమ బండ్లు కట్టారు. పసుపు, కుంకుమలు చల్లుకుంటుండగా మాటామాటా పెరిగి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరినొకరు నెట్టుకున్నారు. అనంతరం మాటామాటా పెరిగి రాళ్ల దాడికి దిగారు. వైసీపీ నేతలు కర్రలు, రాళ్లతో వెంటపడి తరుముతూ టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు. ఒక్కసారిగా భయానక అలజడి చెలరేగింది. పండగ వాతావరణం కాస్తా భయకంపితమైంది. గ్రామస్థులు గృహాల్లోకి పరుగులు పెట్టారు. బాబు, శివరాజులను వైసీపీ నేతలు గాయపరిచారు. తమ నేతలకు గాయాలవడంతో టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించి ఎదురు దాడికి దిగారు. రాళ్లు, కర్రలతో వైసీపీ నేతలపై దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన కొందరికి గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి టీడీపీ నేతల గృహాలపై రాళ్ల వర్షం కురిపించారు. టీడీపీ నేతలు తమ గృహాల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నా గానీ రాళ్ల దాడి ఆపలేదు. కొందరు టీడీపీ నేతలు గ్రామంలోని తమ గృహాల్లో బిక్కుమంటూ గడుపుతుండగా, మరికొందరు గ్రామం వదిలి పోయారు. కాగా, దాడులకు దిగిన టీడీపీ, వైసీపీ నేతలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. వీరంతా బంధువులే. ఒకే కుటుంబంలా మెలిగిన వారే. వివాహాల్లో ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకున్న వారే. ఒకప్పుడు టీడీపీలో ఉన్నవారే. ఐదేళ్ల క్రితం నెలకొన్న మనస్పర్థలతో వర్గాలుగా విడిపోయారు. ఆధిపత్య పోరులో భాగంగా ఒక వర్గం వైసీపీ పంచన చేరింది. మిగతా వారు టీడీపీలోనే కొనసాగుతున్నారు.

Updated Date - 2023-08-30T04:42:03+05:30 IST