2 కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు సర్వే
ABN , First Publish Date - 2023-06-02T04:36:43+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం–విజయవాడ–శంషాబాద్, విశాఖపట్నం–విజయవాడ–
న్యూఢిల్లీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు కొత్త సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్లకు అవసరమైన సర్వేకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం–విజయవాడ–శంషాబాద్, విశాఖపట్నం–విజయవాడ–కర్నూలు మార్గాల్లో రైల్వే లైన్ల కోసం సర్వేకు రైల్వే బోర్డు అంగీకారం తెలుపుతూ దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన సాంకేతికపరమైన సాధ్యాసాధ్యాలను (టెక్నికల్ ఫిజిబిలిటీ) ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు. సర్వే చేపట్టిన తర్వాత ప్రాజెక్టుపై ముందుడుగు పడుతుంది. ఈ రైల్వే లైన్లకు సంబంధించి పలుమార్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ను కలిసి లేఖలు సమర్పించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ రెండు రూట్లలో సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెల్లడించిందన్నారు. ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్ఠంగా 220 కేఎంపీహెచ్ వేగంతో ప్రయాణించేలా) రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారని, ఈ సర్వేను 6 నెలల్లో పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. .