భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీల విడుదలపై సుప్రీంకోర్టు స్టే

ABN , First Publish Date - 2023-08-02T03:39:18+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసిన భారతీ సిమెంట్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీలు) విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీల విడుదలపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసిన భారతీ సిమెంట్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీలు) విడుదలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సంస్థకు చెందిన దాదాపు రూ.150 కోట్ల విలువైన ఎఫ్‌డీలను బ్యాంకు హామీ తీసుకుని విడుదల చేయాలని అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ 2019లో తీర్పు ఇవ్వగా.. తెలంగాణ హైకోర్టు కూడా సమర్థించింది. దీనిని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఎఫ్‌డీలను తమ వద్ద పెట్టుకుని బ్యాంకు గ్యారెంటీని ఇచ్చేస్తామని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు తెలిపారు. ఎఫ్‌డీలను ఈడీ ఎన్‌క్యా్‌ష చేసిందన్నది వాస్తవమేనా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఈడీ ఎన్‌క్యా్‌ష చేసిందని తాను అనుకోవడం లేదని రాజు సమాధానమిచ్చారు. అది తెలుసుకుని రమ్మనే కదా గత విచారణను వాయిదా వేశామని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. ఎఫ్‌డీ, బ్యాంకు గ్యారెంటీల్లో దేనిని ఈడీ అట్టిపెట్టుకుంటుందో చెప్పడానికి వాయిదా వేశారని తాను అనుకున్నానని రాజు తెలిపారు. బుధవారానికి వాయిదా వేస్తే ఈ విషయంపై సూచనలు తీసుకుని వస్తానన్నారు. ఒకవేళ ఎఫ్‌డీలను ఎన్‌క్యా్‌ష చేస్తే తిరిగి వాటిని ఎఫ్‌డీలుగా మార్చుతామని స్పష్టం చేశారు. భారతీ సిమెంట్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదిస్తూ.. అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఉత్తర్వుల ప్రకారం బ్యాంకు గ్యారెంటీలు తీసుకుని ఎఫ్‌డీలను విడుదల చేయాల్సి ఉంటుందని.. తాము బ్యాంకు గ్యారెంటీ ఇచ్చినా ఈడీ ఎఫ్‌డీలను విడుదల చేయడం లేదని తెలిపారు. చివరకు ఎఫ్‌డీల విడుదలపై స్టే విధించిన ధర్మాసనం.. బ్యాంకు గ్యారెంటీని భారతీ సిమెంట్స్‌ వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

Updated Date - 2023-08-02T03:39:18+05:30 IST