విశాఖలో సుపారీ గ్యాంగ్ కలకలం
ABN , First Publish Date - 2023-06-01T04:58:27+05:30 IST
విశాఖ నగరంలో సుపారీ గ్యాంగ్ పట్టుబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విశాఖ నగరంలోని ఒక హోటల్లో బస చేసిన ఆరుగురు వ్యక్తుల నుంచి
విశాఖపట్నం, మే 31(ఆంధ్రజ్యోతి), సీతమ్మధార: విశాఖ నగరంలో సుపారీ గ్యాంగ్ పట్టుబడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విశాఖ నగరంలోని ఒక హోటల్లో బస చేసిన ఆరుగురు వ్యక్తుల నుంచి పోలీసులు బుధవారం ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఒకరు తమకు తుపాకీ ఇచ్చి ఒడిశాలో అందజేయమన్నట్టు చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... మహారాష్ట్రకు చెందిన శ్రీధర్ పతంగి(24), ఆదేశ్ ప్రవచ(19), కైలాశ్ గణేశ్ పవార్(30), విజయ్ పవార్(21), అజయ్ చర్వాషి(25), పరశురాం విబ్బేడి(58) నాందేడ్ ఎక్స్ప్రెస్లో మహారాష్ట్ర నుంచి మంగళవారం విశాఖనగరానికి చేరుకున్నారు. రైల్వే న్యూకాలనీలోని ఓ హోటల్లో రూమ్ తీసుకున్నారు. లాడ్జి సిబ్బందికి తమ ఆధార్ కార్డు అందజేసి తమ వివరాలను నమోదు చేయించుకున్నారు. మంగళవారం రాత్రి ఫోర్త్ టౌన్ క్రైమ్ పోలీసులు రోజువారీ తనిఖీలో భాగంగా హోటల్కు వెళ్లారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందినవారి వివరాలు రికార్డుల్లో ఉండడంతో వారి గదిలో సోదాలు చేశారు. ఒక బ్యాగ్లో తుపాకీ లభ్యమైంది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.